ఇంధనాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్

  • స్టాక్ ఉంచుకుని 'నో స్టాక్' బోర్డులు పెట్టే బంకులపై కఠిన చర్యలకు మంత్రి ఆదేశాలు 
  • ఆక్వా, వరి రైతులకు ఇంధన కొరత రాకుండా చూడాలన్న మంత్రి
  • సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు
ఇంధనాన్ని పక్కదారి పట్టిస్తూ, కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత, అక్రమాలపై మంత్రి నాదెండ్ల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అక్రమాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని హెచ్చరించారు.

ఈ సందర్బంగా ఇంధన బంకుల నిర్వహణపై పలు కీలక సూచనలు చేశారు. కొన్ని బంకుల్లో స్టాక్ ఉన్నప్పటికీ 'నో స్టాక్' బోర్డులు పెట్టి వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నారని, అలాంటి యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంధన లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అమలు చేస్తున్న 'రేషన్ పద్ధతి'ని కొనసాగించాలని సూచించారు.

ముఖ్యంగా ఆక్వా, వరి రైతులకు వ్యవసాయ పనులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంధన సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఇంధన కొరతపై తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించే వారిని గుర్తించి, వెంటనే కేసులు నమోదు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.

ఇంధనం పోయడానికి నిరాకరిస్తున్న బంకులపై 1967 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో బంకుల మూసివేత గణనీయంగా తగ్గిందని, చమురు కంపెనీల నుంచి ఇంధన సరఫరా కూడా మెరుగుపడిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.

More Telugu News