తలసానికి కీలక బాధ్యతలను అప్పగించిన కేటీఆర్
- పార్టీ కీలక నేతలతో భేటీ అయిన కేటీఆర్
- రాబోయే ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘ చర్చ
- దొంగ ఓట్లు, డబుల్ ఓట్ల విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని సూచన
- ఈ కార్యక్రమానికి పర్యవేక్షకుడిగా తలసాని నియామయం
- ప్రతి నియోజకవర్గంలో బూత్ లెవెల్ అసిస్టెంట్లను నియమించాలన్న తలసాని
హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈరోజు జరిగిన కీలక సమావేశంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలతో కలిసి ఆయన రాబోయే ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కీలక బాధ్యతలను అప్పగించారు.
ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని అత్యంత సీరియస్గా తీసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో జుబ్లీహిల్స్ వంటి చోట్ల జరిగిన పరిణామాలను గుర్తు చేస్తూ, ప్రత్యర్థి పార్టీలు నమోదు చేయించే దొంగ ఓట్లు, డబుల్ ఓట్లను గుర్తించి... వాటిని తొలగించేలా పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. నగరంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండేలా చూడటం, కొత్త ఓటర్ల నమోదులో కార్యకర్తలు చొరవ చూపడంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఈ మొత్తం కార్యక్రమానికి పర్యవేక్షకుడిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కేటీఆర్ నియమించారు. ఈ బాధ్యతలపై తలసాని మాట్లాడుతూ, ప్రతి నియోజకవర్గంలో బూత్ లెవల్ అసిస్టెంట్లను తక్షణమే నియమించాలని కోరారు. వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ఓటర్ల జాబితాలో ఎలాంటి అక్రమాలు జరగకుండా బూత్ స్థాయి నుంచే కాపలా కాయాలని స్పష్టం చేశారు. నగర రాజకీయాల్లో ఓటర్ల జాబితాయే గెలుపోటములను నిర్ణయిస్తుందని, అందుకే దీనిపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని ఆయన పార్టీ నేతలకు సూచించారు.