ప్రభుత్వం జోక్యం చేసుకోకుంటే నిలిపివేత తప్పదు: కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- యుద్ధం కారణంగా పెరిగిన ఏటీఎఫ్ ధర
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టంగా మారిందని లేఖ
- ఎయిరిండియా, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థల లేఖ
ఈ మేరకు ఎయిరిండియా, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలతో ఏర్పాటైన ది ఫెడరేషన్ ఆఫ్ ఎయిర్లైన్స్ పౌర విమానయాన శాఖ కార్యదర్శికి మంగళవారం లేఖ రాసింది. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉపశమనం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. విమానాల నిర్వహణలో 40 శాతం వాటా ఇంధనానిదే ఉంటుంది. యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరలు భారీగా పెరగడంతో విమానయాన సంస్థల ఆధ్వర్యంలోని సంస్థ లేఖ రాసింది.
జెట్ ఫ్యూయల్ ధరలు భారీగా పెరగడంతో సర్వీసులు నడపడం కష్టంగా మారిందని తన లేఖలో పేర్కొంది. ఇప్పటికే విమానయాన సంస్థలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మద్దతు లేకుంటే నిలిపివేత శరణ్యమని పేర్కొంది. ఏటీఎఫ్ ధరలను స్థిరీకరించాలని ఈ లేఖలో కోరాయి. అంతర్జాతీయ మార్కెట్లో విమాన ధరలు పెరిగినప్పుడు, ఏటీఎఫ్ ధరలు పెరగకుండా ఉండేలా గతంలో మాదిరి క్రాక్ బ్యాండును ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏటీఎఫ్పై ఉన్న 11 శాతం ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తివేయాలని కోరాయి.