ఉక్కు నగరం నుంచి డేటా సిటీగా విశాఖ.. చరిత్ర సృష్టిస్తున్నాం: మంత్రి లోకేశ్‌

  • విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్‌కు శంకుస్థాపన
  • ఉక్కు నగరం ఇకపై 'డేటా సిటీ'గా మారుతుందన్న‌ మంత్రి లోకేశ్‌ 
  • విశాఖను ట్రిలియన్ డాలర్ ఎకనామిక్ రీజియన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమ‌ని వెల్ల‌డి
  • ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని స్పష్టీకరణ
  • కొందరు కేసులు వేసి ప్రాజెక్టును అడ్డుకోవాలని చూశారని పరోక్ష విమర్శలు
విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్‌కు శంకుస్థాపన జ‌రిగింది. ఈ చారిత్రక ప్రాజెక్టుతో ఉక్కు నగరంగా పేరుగాంచిన విశాఖ.. ఇకపై 'డేటా సిటీ'గా ప్రపంచ పటంలో నిలవనుందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా భారత్‌లోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖకు వచ్చిందని, ఇది రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.

శంకుస్థాపన కార్య‌క్ర‌మం అనంతరం మంత్రి లోకేశ్‌ ప్రసంగించారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు సహకరిస్తున్న అదానీ కనెక్స్, ఎయిర్‌టెల్ నెక్స్‌ట్రా సంస్థలకు, భూములు ఇచ్చిన రైతులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏఐ డేటా సెంటర్‌తో విశాఖ గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో చేరిందని, ఈ ప్రాంతాన్ని మొదటి ట్రిలియన్ డాలర్ ఎకనామిక్ రీజియన్‌గా అభివృద్ధి చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు.

2019-24 మధ్య రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని పునరుద్ధరించేందుకే ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారని లోకేశ్‌ అన్నారు. సీఎం చంద్రబాబుకు సైబరాబాద్‌ను హైటెక్ సిటీగా మార్చిన ట్రాక్ రికార్డు ఉందని గుర్తుచేశారు. ఆర్సెలార్ మిట్టల్, గూగుల్ వంటి ప్రాజెక్టులు వేగంగా వస్తుండటమే రాష్ట్రంపై పెట్టుబడిదారులకు పెరిగిన విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ సహకారంతో దేశంలోనే 25 శాతం మేర పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని వివరించారు.

తమది 'ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని' విధానమని, 'అభివృద్ధి వికేంద్రీకరణ' నినాదంతో ముందుకు వెళ్తున్నామని లోకేశ్‌ స్పష్టం చేశారు. క్లస్టర్ ఆధారిత అభివృద్ధితో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టుతో పాటు మొత్తం 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

కొందరు ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేసులు వేసి ఇబ్బంది పెట్టాలని చూశారని లోకేశ్‌ విమర్శించారు. 'ప్రజా ప్రభుత్వానిది గూగుల్ అయితే, ఆ పార్టీది గొడ్డలి' అంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌పై విశ్వాసం ఉంచి పెట్టుబడులు పెట్టినందుకు గూగుల్ యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Nara Lokesh
Vizag
Google Cloud Data AI Hub
AP

More Telugu News