గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు కాసేపట్లో చంద్రబాబు భూమిపూజ

  • 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు
  • తర్లువాడ, రాంబిల్లి, అడవివరంలలో 600 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
  • పర్యటనలో భాగంగా సింహాచలం దర్శనం, రైల్వే జోన్ అధికారులతో సీఎం భేటీ
  • రాత్రి గూగుల్ ప్రతినిధులతో సమావేశమై విందు ఇచ్చిన ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. విశాఖపట్నంలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ గూగుల్ ఏర్పాటు చేయనున్న ఏఐ డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే విశాఖ చేరుకున్నారు.

దాదాపు 15 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.25 లక్షల కోట్లు) భారీ పెట్టుబడితో, 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ డేటా సెంటర్‌ను నిర్మించనున్నారు. దీని కోసం విశాఖ జిల్లాలోని తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో ప్రభుత్వం సుమారు 600 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా విశాఖ రూపురేఖలు మారడంతో పాటు, రాష్ట్రంలో టెక్నాలజీ అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని భావిస్తున్నారు.

ఈ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి సీఎం చంద్రబాబు గూగుల్ కంపెనీ ప్రతినిధులకు ఆత్మీయ విందు ఇచ్చారు. నేటి భూమిపూజ కార్యక్రమం తర్లువాడలో జరగనుంది. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని, సీఎం చంద్రబాబు డెలిగేట్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

అనంతరం మధ్యాహ్నం సింహాచలం వెళ్లి శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో సమావేశమవుతారు. సాయంత్రం తన విశాఖ పర్యటన ముగించుకుని అమరావతికి తిరుగు పయనమవుతారు.

Chandrababu Naidu
Google AI Data Center
Visakhapatnam
Andhra Pradesh
Nara Lokesh
Technology Hub
Data Center
Tarluwada
Ramilli
Adavivaram

More Telugu News