భార్యను చంపి.. భర్త మిస్సింగ్ డ్రామా.. లేఖతో గుట్టురట్టు!

  • భార్యను హత్య చేసి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన భర్త
  • నిందితుడు రాసిన లేఖతో కేసును ఛేదించిన పోలీసులు
  • పాడుబడిన ఇంట్లోని చెక్క పెట్టెలో మహిళ మృతదేహం
  • వివాహేతర సంబంధం అనుమానంతోనే హత్య జరిగినట్టు అనుమానం
  • పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు
గుజరాత్‌లోని సూరత్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘోరం వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసి, ఏమీ తెలియనట్టు ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి నాటకమాడాడో భర్త. అయితే, నిందితుడు రాసిన ఒకే ఒక్క లేఖ అతడి నేరాన్ని ప్రపంచానికి తెలియజేసింది.

సూరత్‌కు చెందిన 40 ఏళ్ల విశాల్ సాల్వి, తన భార్య శిల్పా సాల్వి (39) నాలుగు రోజుల నుంచి కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించాడు. వృత్తిరీత్యా డైటీషియన్ అయిన శిల్ప కోసం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, వారి ఇంట్లో లభించిన చేతిరాత లేఖతో కేసు అనూహ్య మలుపు తిరిగింది.

విశాల్ రాసిన ఆ లేఖ వారి మైనర్ కుమారుడికి దొరికింది. అందులో "తాను పెద్ద తప్పు చేశానని, శిల్ప ఇక బతికి లేదు" అని రాసి ఉండటంతో పోలీసులు దీనిని హత్య కేసుగా నిర్ధారించుకున్నారు. వెంటనే దర్యాప్తును వేగవంతం చేసి, సలబత్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని నిందితుడికి చెందిన పాడుబడిన ఇంటిని గుర్తించారు.

తాళం పగలగొట్టి లోపలికి వెళ్లగా ఓ మూలన ఉన్న చెక్క పెట్టె నుంచి తీవ్ర దుర్వాసన రావడం గమనించారు. పెట్టెను తెరిచి చూడగా, అందులో పచ్చి సిమెంట్‌తో కప్పి ఉన్న స్థితిలో కుళ్లిపోయిన శిల్ప మృతదేహం బయటపడింది. భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేయడానికి నాలుగు, ఐదు రోజుల ముందే ఈ హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.

భార్యాభర్తల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని, భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే విశాల్ ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు విశాల్ పరారీలో ఉండగా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రత్యేక బృందాలు అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి.

Vishal Salvi
Surat crime
Gujarat murder
Wife murdered
Missing person case
Adultery suspicion
Salabatpura police station
CCTV footage
Domestic dispute
Husband absconding

More Telugu News