పానీపూరీ తిని ఆరేళ్ల బాలుడి మృతి.. 18 మందికి అస్వస్థత

  • ఝార్ఖండ్‌లో గిరిడీ జిల్లాలో ఘటన
  • ఫుడ్ పాయిజనింగ్ అని అనుమానిస్తున్న అధికారులు
  • ఇంటింటికి తిరిగి పానీపూరీ అమ్మిన వ్యాపారి పరారీ
  • ఘటనపై పోలీసుల దర్యాప్తు
ఝార్ఖండ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గిరిడీ జిల్లాలో పానీపూరీ తిన్న తర్వాత ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో 18 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే కావడం గమనార్హం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బజ్టో గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. గ్రామంలో ఒక వ్యాపారి ఇంటింటికీ తిరిగి పానీపూరీ అమ్మాడు. అది కొనుక్కుని తిన్న పలువురికి శనివారం రాత్రి నుంచి అనారోగ్య లక్షణాలు మొదలయ్యాయి. తీవ్ర జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. ఆదివారం ఉదయానికి వారి పరిస్థితి మరింత క్షీణించడంతో గ్రామస్థులు బాధితులను వెంటనే సదర్ ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మిగిలిన 18 మంది ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.

పల్మో వాసి అయిన పానీపూరీ వ్యాపారి ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఫుడ్ పాయిజనింగ్ వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నట్లు సివిల్ సర్జన్ డాక్టర్ బచ్చా ప్రసాద్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న 18 మంది పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యులు వారిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. విచారణ నివేదికలు అందిన తర్వాతే మరణానికి కచ్చితమైన కారణం తెలుస్తుందని ఆయన వివరించారు.

Pani Puri
Food Poisoning
Jharkhand
Giridih
Child Death
Hospitalization
Health Emergency
India News

More Telugu News