తెలంగాణలో ఎండల ఉగ్రరూపం.. వడదెబ్బకు నలుగురి బలి

  • రాష్ట్రంలో కొనసాగుతున్న తీవ్రమైన ఎండలు
  • మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • నాగర్‌కర్నూల్‌లో పిడుగుపాటుకు ఒక యువకుడి మృతి
  • పలు జిల్లాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
తెలంగాణలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. వడదెబ్బ కారణంగా శనివారం ఒక్కరోజే నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. హనుమకొండ జిల్లాకు చెందిన సాదుల నరహరి (58), వరంగల్‌కు చెందిన ఎండీ యాకూబీ (63), మంచిర్యాల జిల్లా వాసి కొట్రంగి జయరాం (40), సూర్యాపేట జిల్లాకు చెందిన మామిడి నరసింహ (51) వడదెబ్బతో మరణించారు. వీరంతా పనులకు వెళ్లి అస్వస్థతకు గురైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

మరోవైపు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 44.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కుమరంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లోని పలుచోట్ల 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కామారెడ్డి, ఆదిలాబాద్, భూపాలపల్లి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోనూ ఎండల తీవ్రత కొనసాగుతోంది.

పిడుగుపాటుకు యువకుడు బలి
నాగర్‌కర్నూల్ జిల్లాలో పిడుగుపాటుకు ఓ యువకుడు మృతి చెందాడు. బల్మూరు మండలం మైలారం గ్రామానికి చెందిన గట్టు సలేశ్వరం (19) పొలంలో గేదెలను కాస్తుండగా ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలు కావడంతో  రక్షణ కోసం తాటిచెట్టు కిందకు వెళ్లాడు. అదే సమయంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మరణించాడు.

Telangana Heatwave
Heatwave Telangana
Telangana Weather
Heat Stroke Deaths
High Temperatures Telangana
Mancherial Temperature
Nagar Kurnool Lightning
Lightning Death

More Telugu News