తలకు గాయాలతో హర్యాన్వీ యువ నటి దివ్యాంక అనుమానాస్పద మృతి

  • ఇంట్లో అస్వస్థతకు గురై కుప్పకూలి ప్రాణాలు విడిచిన నటి
  • తలకు తీవ్ర గాయం కావడంతో మరణంపై అనుమానాలు
  • గుండెపోటు అని ప్రాథమికంగా భావిస్తున్నా కారణంపై లేని స్పష్టత 
  • సోషల్ మీడియాలో దివ్యాంకకు 13 లక్షల మంది ఫాలోవర్లు
హర్యాన్వీ సంగీత ప్రపంచంలో ఎదుగుతున్న యువ నటి, మోడల్ దివ్యాంక సిరోహి (30) అనుమానాస్పద రీతిలో మరణించారు. మంగళవారం రాత్రి ఘజియాబాద్‌లోని రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లో ఉన్న ఆమె నివాసంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆమె కుప్పకూలిపోయారని, ఈ క్రమంలో తలకు తీవ్ర గాయమైందని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే దివ్యాంకకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 13 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఇప్పటివరకు 50కి పైగా హర్యాన్వీ పాటల్లో నటించారు. సునంద శర్మ పాడిన 'మేరీ మమ్మీ నూ పసంద్ నహీ తూ' పాట వీడియోతో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. మాసూమ్ శర్మ, అమిత్ సైనీ వంటి ప్రముఖ కళాకారులతో కలిసి పనిచేశారు.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం మంగళవారం దివ్యాంక బాగానే ఉన్నారు. తన సోదరుడి కోసం వంట కూడా చేశారు. అయితే, కాస్త నలతగా ఉందని చెప్పినట్టు తెలిసింది. ఇంతలో ఆమె సోదరుడు అత్యవసర పని మీద బయటకు వెళ్లగా, మెయిన్ గేట్‌కు తాళం వేయమని మెసేజ్ పెట్టారు. దీనికి ఆమె "ఓకే" అని సమాధానమిచ్చారు. కానీ, కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి వచ్చేసరికి దివ్యాంక విగతజీవిగా పడి ఉన్నారు. ఆమె శరీరం బిగుసుకుపోయి, స్వల్పంగా వాపు కనిపించిందని బంధువులు తెలిపారు.

ప్రాథమికంగా గుండెపోటు కారణంగా మరణించి ఉండొచ్చని భావిస్తున్నప్పటికీ, మరణానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఆమె ఆకస్మిక మృతి పట్ల హర్యాన్వీ కళాకారుడు మన్‌జీత్‌తో పాటు పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన దివ్యాంక తన సోదరుడు, సోదరితో కలిసి ఘజియాబాద్‌లో నివసిస్తున్నారు.

Divyanka Sirohi
Haryanvi actor
Ghaziabad
Instagram
Masoom Sharma
Bulandshahr

More Telugu News