కేసీఆర్, హరీశ్ రావులపై తక్షణ చర్యలు వద్దన్న హైకోర్టు... అద్దంకి దయాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • కళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టే
  • బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకోవడంపై అద్దంకి దయాకర్ ఫైర్
  • తక్షణ చర్యలు వద్దని మాత్రమే హైకోర్టు చెప్పిందని వ్యాఖ్య
  • సీబీఐ నివేదికలో అవినీతి భాగోతం బయటపడుతుందన్న దయాకర్

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలపై రాజకీయ దుమారం మొదలైంది. పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో ఆరోపణలు ఎందుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులపై తక్షణమే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ నేత, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.


కాళేశ్వరం విచారణ నివేదికపై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకోవడంపై అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఈ తీర్పు వల్ల బీఆర్ఎస్‌కు ఒరిగేదేమీ లేదని ఆయన అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగబద్ధమేనని కోర్టు అంగీకరించిందని, కేవలం తక్షణమే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మాత్రమే చెప్పిందని ఆయన గుర్తు చేశారు. దీన్ని చూసి బీఆర్ఎస్ నేతలు 'చంకలు గుద్దుకోవడం' హాస్యాస్పదమన్నారు.


త్వరలోనే సీబీఐ నివేదిక కూడా వస్తుందని, అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులోని అసలు వాస్తవాలు, అవినీతి భాగోతం బయటపడతాయని తెలిపారు. బీజేపీతో కలిస్తే తమ తప్పులు మాఫీ అవుతాయని వారు భావిస్తున్నారని... హరీశ్ రావు ఢిల్లీలో ప్రదక్షిణలు చేయడం వెనుక ఆంతర్యం ఇదేనని ఆరోపించారు. కానీ తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.

Addanki Dayakar
Congress
Kaleswaram
PC Ghosh Commission
KCT
Harish Rao
BRS

More Telugu News