పల్నాడులో కలకలం.. వైసీపీ నేత ఇంట్లో ఐదు నాటు బాంబులు
- పల్నాడు జిల్లా పాపాయపాలెంలో తీవ్ర కలకలం
- వైసీపీ నేత ఇంటి నుంచి ఐదు నాటు బాంబుల స్వాధీనం
- టీడీపీ నేత హత్యకేసు నిందితుడి తండ్రి ఇల్లుగా గుర్తింపు
- పాత కక్షల నేపథ్యంలోనే బాంబులు దాచారని పోలీసుల అనుమానం
- గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు
గ్రామస్థుల సమాచారం మేరకు నిన్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. వైసీపీ నేతగా ఉన్న సంక్రాంతి కోటయ్యకు చెందిన ఇంటి టాయిలెట్లో ప్లాస్టిక్ బకెట్లో దాచిన ఐదు నాటు బాంబులను గుర్తించారు. సమాచారం అందుకున్న సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు, క్రోసూరు సీఐ సురేశ్.. బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకుని వాటిని నిర్వీర్యం చేశారు.
గతేడాది డిసెంబర్లో జరిగిన టీడీపీ నేత కృష్ణయ్య హత్య కేసులో కోటయ్య కుమారుడు గోపాలకృష్ణ అలియాస్ గోపి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో పాత కక్షల కారణంగానే ప్రత్యర్థులపై దాడి చేసేందుకు ఈ బాంబులను నిల్వ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు.