జగన్ తీరు పాము తన గుడ్లను తానే తిన్నట్లుగా ఉంది: నిమ్మల రామానాయుడు
- అధికారం, డబ్బుల కోసం జగన్ ఎవరినైనా బలి చేస్తారన్న నిమ్మల
- ఆయనకు చెల్లైనా, తల్లైనా, బాబాయ్ అయినా ఒకటే అని విమర్శ
- ప్రజలు వైసీపీని రాజకీయాలకు దూరంగా పెట్టాలని పిలుపు
వైసీపీ అధినేత జగన్ పై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ తీరు 'పాము తన గుడ్లను తానే తిన్నట్లు'గా ఉందని అభివర్ణించారు. జగన్ కు అధికార దాహం, ధన దాహం ఎక్కువని... వాటి కోసం కోసం జగన్ ఎవరినైనా బలి చేస్తారని, ఆయనకు తల్లైనా, చెల్లైనా, బాబాయ్ అయినా ఒకటేనని ఎద్దేవా చేశారు. జగన్ నడిపిస్తున్నది క్రిమినల్ రాజకీయాలని, వైసీపీ కార్యకర్తలు ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలని హితవు పలికారు.
ఇటీవల జరిగిన వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యపై మంత్రి స్పందిస్తూ.. ఇది జగన్ స్వార్థానికి పరాకాష్ఠ అని ఆరోపించారు. జగన్ సన్నిహితుడు నిత్యానంద రెడ్డి ఈ హత్యకు పాల్పడటం వెనుక తాడేపల్లి ప్యాలెస్ అనుబంధమే కారణమని పేర్కొన్నారు. హింసా రాజకీయాలు చేసేవారికి ఆంధ్రప్రదేశ్లో చోటు లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర శ్రేయస్సు కోరి ప్రజలు వైసీపీని రాజకీయంగా దూరం పెట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు.