మోదీ ఝాల్‌మురీ.. .. ఝార్ఖండ్ సీఎం హెలికాప్టర్‌కు ల్యాండింగ్ బంద్!

  • ప్రచారంలో భాగంగా ఝాల్‌మురీ తిన్న ప్రధాని మోదీ
  • మోదీ పర్యటన వల్లే సోరెన్ హెలికాప్టర్‌కు ల్యాండింగ్ నిరాకరించారన్న టీఎంసీ
  • ఇది ఆదివాసీ వ్యతిరేక చర్య అంటూ టీఎంసీ ఆరోపణ
  • "లూటీలో పీహెచ్‌డీ" చేసిందంటూ టీఎంసీపై మోదీ విసుర్లు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఓ చిన్నపాటి స్నాక్ బ్రేక్ పెద్ద రాజకీయ దుమారానికి దారితీసింది. ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డు పక్కన 'ఝాల్‌మురీ' తినడం కోసం తన పర్యటనను పొడిగించారని, ఆ కారణంగానే ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ హెలికాప్టర్‌కు ల్యాండింగ్ అనుమతి నిరాకరించారని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తీవ్రంగా ఆరోపించింది.

ఆదివారం ఝార్గ్రామ్‌లో ఓ బహిరంగ సభ ముగించుకున్న ప్రధాని మోదీ తన కాన్వాయ్‌ను ఆపి మరీ రోడ్డు పక్కన ఉన్న బండి వద్ద ఝాల్‌మురీ (మురమురాల మిశ్రమం) రుచి చూశారు. ఓ సాధారణ వ్యక్తిలా వ్యాపారితో ముచ్చటిస్తూ "ఉల్లిపాయలు వేస్తారా?" అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన జేబులో నుంచి డబ్బులు తీసి చెల్లించడం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అయితే, ఈ ఘటనపై టీఎంసీ తీవ్రస్థాయిలో మండిపడింది. కేవలం ఫోటోషూట్ల కోసమే ప్రధాని తన పర్యటనను అనవసరంగా పొడిగించారని, దానివల్లే ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన భార్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు ల్యాండింగ్ క్లియరెన్స్ లభించలేదని ఆరోపించింది. "ఆదివాసీ నాయకులను గంటల తరబడి వేచి చూసేలా చేసి, చివరికి వారిని రాంచీకి తిప్పి పంపారు. ఇది ముమ్మాటికీ ఆదివాసీ వ్యతిరేక చర్య" అని టీఎంసీ తమ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది.

ఈ వివాదం కొనసాగుతుండగానే, ప్రధాని మోదీ టీఎంసీపై తన విమర్శల దాడిని మరింత తీవ్రతరం చేశారు. మేదినీపూర్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ... "గత 15 ఏళ్లలో తృణమూల్ ప్రభుత్వం లూటీ చేయడంలో పీహెచ్‌డీ చేసింది. మమతా బెనర్జీ సర్కార్ కేవలం చొరబాటుదారుల ప్రయోజనాల కోసమే పనిచేస్తోంది" అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులు, యువతను విస్మరించి అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

Narendra Modi
West Bengal Elections
Jhargram
Jhalmuri
Hemant Soren
Trinamool Congress
Mamata Banerjee
Jharkhand CM
Medinipur Rally

More Telugu News