అమెరికా బలగాలను ఓడించేందుకు మా నౌకాదళం సిద్ధంగా ఉంది: ఇరాన్ సుప్రీం లీడర్

  • శత్రువులకు ఓటమిని రుచి చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి
  • ఇరుపక్షాలు నిర్ణయం తీసుకునే వరకు అమెరికాతో చర్చల్లేవన్న ఇరాన్
  • అమెరికా నుంచి వచ్చే ఏకపక్ష ఆదేశాలకు కట్టుబడి ఉండబోమని స్పష్టీకరణ
అమెరికా బలగాలను ఓడించడానికి ఇరాన్ నౌకాదళం సిద్ధంగా ఉందని ఆ దేశ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తన సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. "శత్రువులకు మరో ఓటమిని రుచి చూపించేందుకు ఇరాన్ నౌకాదళం సిద్ధంగా ఉంది" అని పేర్కొన్నారు.

అమెరికాతో చర్చలపై మంత్రి కీలక వ్యాఖ్యలు

ఇరుపక్షాలు ఉమ్మడి నిర్ణయం తీసుకునే వరకు అమెరికాతో ఎటువంటి చర్చలు జరిపేది లేదని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి సయీద్ ఖతిబ్జా స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధి లక్ష్యంగా ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించే ఎలాంటి దిగ్బంధనాన్ని కూడా టెహ్రాన్ అంగీకరించబోదని అన్నారు. అమెరికా నుంచి వచ్చే ఏకపక్ష ఆదేశాలకు తాము కట్టుబడి ఉండే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. ఇతర దేశాలు ఎలా ఉండాలో చెప్పే హక్కు ఏ దేశానికీ లేదని వ్యాఖ్యానించారు.

Mojtaba Khamenei
US Forces
America

More Telugu News