ఇవాళ రాహల్ గాంధీ, ఖర్గే ఒక జాతీయ విపత్తును అడ్డుకున్నారు: రేవంత్ రెడ్డి

  • భారతదేశ చరిత్రలో సువర్ణదినంగా పేర్కొన్న రేవంత్ రెడ్డి
  • నల్ల బిల్లులను ఓడించేందుకు ఏకమైన వారికి ధన్యవాదాలు తెలిపిన సీఎం
  • స్టాలిన్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ సహా పలువురికి ధన్యవాదాలు తెలిపిన సీఎం
లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ (డీలిమిటేషన్) బిల్లు వీగిపోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే చారిత్రక రోజని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకమై ఓ జాతీయ విపత్తును నివారించాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ బిల్లులను 'నల్ల బిల్లులు'గా అభివర్ణించిన ఆయన, వాటిని ఓడించేందుకు ఐక్యంగా నిలిచిన మిత్రపక్షాల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే, లాలూ ప్రసాద్ యాదవ్, హేమంత్ సోరెన్, ఫరూక్ అబ్దుల్లా, నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్, కమ్యూనిస్టు పార్టీల నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. విపత్కర పరిస్థితుల్లో విపక్షాలన్నీ కలిసికట్టుగా నిలబడ్డాయని కొనియాడారు. చివరగా 'జై హింద్' అంటూ తన పోస్టును ముగించారు.



Revanth Reddy
Rahul Gandhi
Mallikarjun Kharge
Telangana
131st Constitutional Amendment Bill

More Telugu News