తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోవాలంటూ పొన్నం లేఖ.. డీజీపీ స్పందన ఏమిటంటే..!
- తెలంగాణలో దుమారం రేపుతున్న తేజస్వి సూర్య వ్యాఖ్యలు
- క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి పొన్నం లేఖ
- చట్టసభల్లో సభ్యులు మాట్లాడిన అంశాలపై చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు లేదన్న డీజీపీ
తెలంగాణ అస్తిత్వంపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పుడు న్యాయపరమైన మలుపు తిరిగింది. పార్లమెంట్ వేదికగా తెలంగాణ ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చిన తేజస్విపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డికి లేఖ రాశారు. అయితే, ఈ లేఖపై స్పందించిన డీజీపీ, చట్టసభల పరిధిలో జరిగే చర్చలపై పోలీసులకు ఉండే పరిమితులను స్పష్టం చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం చట్టసభల్లో సభ్యులు మాట్లాడిన అంశాలపై చర్యలు తీసుకునే అధికారం పోలీసు విభాగానికి ఉండదని ఆయన తేల్చిచెప్పారు.
మరోవైపు, మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం తన పోరాటాన్ని ఆపడం లేదు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇంతలా కించపరుస్తుంటే రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు నోరు మెదపకపోవడం శోచనీయమని ఆయన మండిపడ్డారు. డీలిమిటేషన్పై జరిగిన చర్చలో తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచాయని, ఇది కేవలం రాజకీయ విమర్శ కాదని, ఒక ప్రాంత చరిత్రను కించపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.