డీలిమిటేషన్పై ప్రధాని భరోసా: హర్షం వ్యక్తం చేసిన నారా లోకేశ్
- రాష్ట్రాల సీట్ల నిష్పత్తిలో మార్పు ఉండబోదన్న మోదీ
- దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్న సమయంలో ప్రధాని హామీ ఎంతో కీలకమన్న లోకేశ్
- ఎన్డీయే సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉంటుందని వ్యాఖ్య
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని, పార్లమెంట్లో రాష్ట్రాల సీట్ల నిష్పత్తిలో మార్పు ఉండబోదని ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన హామీపై ఏపీ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని చేసిన ఈ ప్రకటన దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద ఊరటనిస్తుందని ఆయన పేర్కొన్నారు.
జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలు, సీట్ల విభజన వల్ల తమ ప్రాధాన్యత తగ్గుతుందని ఆందోళన చెందుతున్న తరుణంలో ప్రధాని ఇచ్చిన హామీ ఎంతో కీలకమని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉందనడానికి ప్రధాని మాటలే నిదర్శనమని కొనియాడారు. ఏ రాష్ట్రం కూడా నష్టపోకుండా అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నదే కూటమి ఉద్దేశమని స్పష్టం చేశారు. "ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు.. ఇది ఎన్డీయే గ్యారెంటీ" అంటూ లోకేశ్ ఎక్స్ వేదికగా ధీమా వ్యక్తం చేశారు. సమానత్వమే కూటమి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.