రేవంత్ రెడ్డి వాదన విని తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారు: లోక్ సభలో తేజస్వీ సూర్య

  • డీలిమిటేషన్‌కు జీఎస్‌డీపీని ముడిపెట్టడం మూర్ఖత్వమన్న తేజస్వీ సూర్య
  • నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని హామీ
  • ఏపీ, తెలంగాణలను కాంగ్రెస్ విభజించిన తీరు బ్రిటిష్ కంటే దారుణంగా ఉందని వ్యాఖ్య
  • కాంగ్రెస్ చేసిన విభజన కారణంగా ఏపీ, తెలంగాణ మధ్య నేటికీ ఘర్షణ వాతావరణం ఉందన్న ఎంపీ
డీలిమిటేషన్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వితండవాదం చేస్తున్నారని, ఆయన చెబుతున్నది విని తెలంగాణ ప్రజలు కూడా నవ్వుతున్నారని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. రాష్ట్రాల జీఎస్‌డీపీ ఆధారంగా లోక్ సభ సీట్ల సంఖ్యను పెంచాలన్న రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై ఆయన మండిపడ్డారు. సీట్ల పెంపునకు, జీఎస్‌డీపీ ముడిపెట్టాలన్న తెలంగాణ సీఎం సలహా అత్యంత మూర్ఖంగా ఉందని అన్నారు. అసలు ఆయనకు ఆ సలహా ఎవరిచ్చారో కానీ అందరూ నవ్వుతున్నారని చురక అంటించారు.

లోక్ సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న విపక్ష పార్టీలు, దక్షిణాది పార్టీల వ్యాఖ్యలను సూర్య తప్పుబట్టారు. డీలిమిటేషన్‌పై విపక్షాల వాదన అర్థరహితంగా ఉందని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని హామీ ఇచ్చారు.

డీలిమిటేషన్‌పై ప్రతిపక్షాలు దక్షిణాది రాష్ట్రాల ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాల ఆదాయం అనేది ప్రతి సంవత్సరం మారుతుందని తెలిపారు. దానిని డీలిమిటేషన్‌కు ప్రాతిపదికగా తీసుకోవాలని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ఆదాయం ప్రకారం ఓట్లు లేదా ప్రాతినిధ్యం ఇవ్వాలనుకుంటే దేశంలో అత్యధిక ఆదాయం ఉన్న అంబానీకి లక్ష ఓట్లు ఇవ్వవలసి వస్తుందని ఎద్దేవా చేశారు.

గత ప్రభుత్వాలు మహిళా రిజర్వేషన్ బిల్లును పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడానికే చూస్తున్నాయని అన్నారు. డీలిమిటేషన్‌ను సాకుగా చూపి మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వేగంగా అమలు చేద్దామంటే విపక్షాలు యూటర్న్ తీసుకుంటున్నాయని అన్నారు.

కాంగ్రెస్ నాడు అత్యంత దారుణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను విభజించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన విభజన బ్రిటిష్ వారి కంటే దారుణంగా ఉందని అన్నారు. ఏపీ, తెలంగాణ విభజనను కాంగ్రెస్ పాకిస్థాన్, భారత్ విభజనతో పోల్చారు. విభజన సమయంలో కాంగ్రెస్ అనుసరించిన విధానం వల్ల రెండు రాష్ట్రాల మధ్య నేటికీ ఘర్షణ వాతావరణం నెలకొందని ఆన్నారు.

Tejasvi Surya
Revanth Reddy
Telangana
Lok Sabha
Delimitation
GSDP
South India
Parliament

More Telugu News