జగన్ బతుకే ఒక అరాచకం: మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

  • ఐదేళ్లు జువ్వలదిన్నె హార్బర్‌ను అడ్డుకున్నది జగనే అని ఆరోపణ
  • మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీశారని ఘాటు వ్యాఖ్యలు
  • దేశ రక్షణ సంస్థను వ్యతిరేకించడం జగన్ దుర్మార్గపు ఆలోచన అని ఘాటు విమర్శలు
  • గొడ్డలి రాజకీయమే జగన్ విధానమని తీవ్ర స్థాయిలో ధ్వజం
వైసీపీ అధినేత జగన్ నిన్న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో స్పందించారు. జగన్ బతుకే ఒక అరాచకమని, ఆయనకు అభివృద్ధి చేయడం తెలియదని, గొడ్డలి రాజకీయమే తెలుసని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుండటాన్ని చూసి ఓర్వలేకే జగన్ కులాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. గురువారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ విషయంలో జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని రవింద్ర మండిపడ్డారు. "ఐదేళ్ల పాటు నిధులు, బిల్లులు ఇవ్వకుండా హార్బర్ నిర్మాణాన్ని అడ్డుకుని, మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసింది జగన్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు వేగవంతం చేసి, 901 మీటర్ల జెట్టీ, కోల్డ్ స్టోరేజ్‌లతో ఆధునిక హార్బర్‌గా పూర్తి చేస్తుంటే.. మత్స్యకారులను రెచ్చగొట్టేలా అసత్యాలు మాట్లాడుతున్నారు" అని విమర్శించారు.

దేశ రక్షణ సంస్థపై జగన్ వైఖరి దుర్మార్గం
జువ్వలదిన్నెలో దేశ రక్షణకు కీలకమైన 'సాగర్ డిఫెన్స్' సంస్థకు కేంద్ర అనుమతితో భూమి కేటాయిస్తే, దానిని తరిమికొడతాననడం జగన్ దుర్మార్గపు ఆలోచనకు నిదర్శనమని కొల్లు రవింద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "తల్లి, చెల్లిని వెళ్లగొట్టారు, సొంత బాబాయినే వేసేశారు. ఇప్పుడు దేశ రక్షణ సంస్థను కూడా తరిమికొడతానంటున్నారు. అంటే జగన్‌కు దేశం మీద కూడా భక్తి లేదు. ఆయనకు తెలిసింది గొడ్డలి పార్టీ, గొడ్డలి గుర్తు.. నరుక్కుంటూ పోవడమే" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

అభివృద్ధి, పెట్టుబడులకు జగన్ శత్రువు
గత ఐదేళ్లలో 800 పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమికొట్టిన చరిత్ర జగన్‌దని రవింద్ర ఆరోపించారు. "కియా, అమరరాజా వంటి సంస్థలను బెదిరించి పొరుగు రాష్ట్రాలకు పంపారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారు. నేను వస్తే చట్టాలు మార్చేస్తానంటూ పెట్టుబడిదారులను మళ్లీ భయపెట్టాలని చూస్తున్నారు. విధ్వంసమే నైజంగా ఉన్న జగన్‌ను ప్రజలు నమ్మకే 11 సీట్లకు పరిమితం చేశారు" అని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, జీవో 217ను రద్దు చేసి, వేట నిషేధ భృతిని పెంచి, వారికి అండగా నిలుస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

తమిళనాడు బోట్ల విడుదల అంశంలో జగన్ దుష్ప్రచారం
తమిళనాడు మత్స్యకారుల బోట్లను పట్టుకున్న తర్వాత, వాటిని యువనేత నారా లోకేశ్ చెప్పడం వల్లే పోలీసులు విడుదల చేశారని జగన్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం, దురదృష్టకరం అని కొల్లు రవీంద్ర కొట్టిపడేశారు. ఈ అంశాన్ని రాజకీయంగా మార్చి లబ్ది పొందాలని జగన్ ప్రయత్నించడం బాధాకరమని అన్నారు.

వాస్తవానికి, ఈ బోట్ల విషయంలో స్థానిక గ్రామాల ప్రజలు జోక్యం చేసుకున్నారని వెల్లడించారు. "ఇది మా గ్రామాల మధ్య ఉన్న సమస్య. మేమే చర్చించుకుని పరిష్కరించుకుంటాం" అని వారు కోరారని తెలిపారు. వారి అభిప్రాయాన్ని, ఐక్యతను గౌరవిస్తూ, వారి నిర్ణయం ప్రకారమే మేము ముందుకు వెళ్లాం... అంతేకానీ, ఇందులో లోకేశ్ గారి ప్రమేయం ఉందనడం పచ్చి అబద్ధం అని కొల్లు రవీంద్ర వివరించారు.

"నిజానికి, సముద్ర గస్తీ విషయంలో గత జగన్ ప్రభుత్వ హయాంలోనే తీవ్ర నిర్లక్ష్యం జరిగింది. 2017 వరకు ఇతర రాష్ట్రాల బోట్లు రాకుండా మెరైన్ బోట్లు గస్తీ కాస్తుండేవి. కానీ 2019 తర్వాత ఆ గస్తీ పూర్తిగా నిలిచిపోయింది. బోట్ల రిపేర్లు, మెయింటెనెన్స్‌కు నిధులు ఇవ్వకపోవడం, సిబ్బందిని తొలగించడం వంటి చర్యలతో సముద్ర సరిహద్దులు బలహీనపడ్డాయి. ఆ కారణంగానే తమిళనాడు బోట్లు మన సముద్ర జలాల్లోకి చొరబడి మత్స్య సంపదను దోచుకుపోయే పరిస్థితి ఏర్పడింది.

ఈ పరిస్థితిని గుర్తించిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేశ్ గారు అధికారులను అప్రమత్తం చేశారు. తక్షణమే 650 హార్స్ పవర్ ఇంజిన్లతో కూడిన స్పీడ్ బోట్లను ఏర్పాటు చేసి గస్తీని పటిష్టం చేశాం. అక్రమంగా ప్రవేశిస్తున్న బోట్లను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. వాస్తవాలు ఇలా ఉంటే, జగన్ మాత్రం నిజాన్ని దాచిపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు" అని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.



Jagan Mohan Reddy
Kollu Ravindra
YS Jagan
Andhra Pradesh Politics
TDP
Fisheries Harbor
Sagര്‍ Defence
Nara Lokesh
AP Development
Tamil Nadu Boats

More Telugu News