కొత్త నిబంధనతో తనిఖీలు ఆలస్యం...120 మందికి విమానం మిస్

  • యూరోపియన్ యూనియన్ బోర్డింగ్ కొత్త నిబంధనలు
  • ఎంట్రీ/ఎగ్జిట్ సిస్టం (ఈఈఎస్)ను తీసుకొచ్చిన యూరోప్
  • బయోమెట్రిక్, పింగర్ ప్రింట్ స్కాన్ కారణంగా చెకింగ్ ఆలస్యం
యూరోపియన్ యూనియన్ బోర్డింగ్‌కు సంబంధించి కొత్త నిబంధనలు ప్రవేశపెట్టిన కొద్దిరోజులకే ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. కొత్త నిబంధనల కారణంగా బోర్డింగ్ సమయంలో 120 మందికి పైగా ప్రయాణికులకు విమానం మిస్ అయింది. యూరప్‌లో ఇటీవల బోర్డర్ కంట్రోల్ సిస్టమ్ అమల్లోకి వచ్చింది. ప్రయాణికులు పాస్‌పోర్టు స్టాంపింగ్‌కు బదులు బయోమెట్రిక్, ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేయాల్సి ఉంటుంది.

ఈ కారణంగా వారికి చెకింగ్ ఆలస్యం కావడం వల్ల 120 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో ఉన్నప్పటికీ విమానం ఎక్కలేకపోయారు. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన అనంతరం, మిలాన్ నుంచి మాంచెస్టర్‌కు వెళ్లేందుకు 156 మంది ప్రయాణికులు టిక్కెట్ బుక్ చేసుకున్నారు. ప్రయాణానికి కొన్ని గంటల ముందు వారంతా విమానాశ్రయానికి చేరుకుని, తనిఖీల కోసం వరుస కట్టారు.

తనిఖీలకు మూడు నాలుగు గంటల సమయం పట్టడంతో చాలామంది బోర్డింగ్ గేట్‌కు చేరుకోలేకపోయారు. కొత్త నిబంధనల కారణంగా 156 మందికి గాను 34 మంది పాస్‌పోర్టుల చెకింగ్ మాత్రమే పూర్తయింది. 120 మంది చెకింగ్ పూర్తి కాకపోవడంతో విమానం మిస్ అయింది. కొత్త పద్ధతిలో చెకింగ్ చేయడం వల్ల విమానం మిస్ కావడంతో పాటు గంటల కొద్దీ వరుసలో నిలబడటం వల్ల కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. చెకింగ్ ఆలస్యం కారణంగా మిగిలిన ప్రయాణికుల కోసం విమానాన్ని కొంత సమయం నిలిపి ఉంచారు. కానీ ఆ తర్వాత భద్రతా కారణాల వల్ల బయలుదేరింది.

సరిహద్దు భద్రత కారణంగా యూరోపియన్ దేశాలు కొత్తగా ఎంట్రీ/ఎగ్జిట్ సిస్టం (ఈఈఎస్)ను తీసుకువచ్చాయి. బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్, డేటా బేస్ చెకింగ్ కారణంగా ప్రయాణికులు విమానాన్ని అందుకోలేకపోయారని విమానాశ్రయ అధికారులు తెలిపారు. రద్దీగా ఉండే సమయాల్లో ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం తీసుకోవచ్చని అన్నారు.

European Union
EU border control
Milan
Manchester
Flight delay
EES system
Biometric registration

More Telugu News