రోహిత్ శర్మ హెల్త్ రిపోర్ట్.. ఆడే విషయంలో తుది నిర్ణయాన్ని రోహిత్ శర్మకే వదిలేసిన మేనేజ్మెంట్!

  • గత ఆదివారం ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ రోహిత్
  • కండరాలకు తీవ్ర గాయం లేనట్టుగా రిపోర్ట్
  • రేపు పంజాబ్ కింగ్స్ తో ఆడటంపై అనుమానం

ఆదివారం (ఏప్రిల్ 13) ఐపీఎల్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా స్టార్ బ్యాట్స్ మెన్ కుడి హ్యామ్‌స్ట్రింగ్ (Hamstring) గాయానికి గురై, రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా రోహిత్ మెడికల్ రిపోర్టులు వెలువడ్డాయి. 


ఆదివారం రాత్రి నిర్వహించిన ప్రాథమిక స్కాన్ రిపోర్ట్స్‌లో రోహిత్ కండరాలకు ఎలాంటి తీవ్రమైన గాయం లేదా చీలిక (Tear) ఉన్నట్లు ఆధారాలు లభించలేదు. ఇది ముంబై అభిమానులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. అయితే, ఈ నివేదిక ఇంకా అసంపూర్తిగా ఉందని, కండరాల పట్టివేత (Strain) లేదా ఇతర అంతర్గత సమస్యలను గుర్తించడానికి మరికొన్ని పరీక్షలు అవసరమని వైద్య బృందం భావిస్తోంది.


మరోవైపు, నిన్న జరిగిన జట్టు ప్రాక్టీస్ సెషన్స్‌కు రోహిత్ శర్మ హాజరుకాలేదు. గాయం తీవ్రత పెరగకుండా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రేపు వాంఖడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరగబోయే మ్యాచ్‌లో రోహిత్ ఆడటంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. రోహిత్ ప్రాముఖ్యత దృష్ట్యా, పంజాబ్ మ్యాచ్‌లో ఆయనను ఆడించి రిస్క్ తీసుకోవడం కంటే, విశ్రాంతినివ్వడమే ఉత్తమమని మేనేజ్మెంట్ భావిస్తోంది.

అయితే, తాజా సమాచారం ప్రకారం, ఈ మ్యాచ్‌లో ఆడాలా? వద్దా? అనే దానిపై తుది నిర్ణయాన్ని మేనేజ్మెంట్ రోహిత్ శర్మకే వదిలేసింది. పూర్తి రిపోర్టులు వచ్చిన తర్వాత రోహిత్ తన శారీరక ఫిట్‌నెస్‌ను బట్టి నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. ఈ ఐపీఎల్ సీజన్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో 137 పరుగులు చేశాడు. కేకేఆర్‌పై 78 పరుగులతో అద్భుత ఫామ్‌లో ఉన్న రోహిత్, కీలకమైన సమయంలో గాయపడటం ముంబై జట్టుకు కొంత ఆందోళన కలిగించే విషయమే. బీసీసీఐ మెడికల్ టీమ్ కూడా టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయన ఫిట్‌నెస్‌ను నిశితంగా గమనిస్తోంది.

Rohit Sharma
Mumbai Indians
IPL 2024
Hamstring Injury
Punjab Kings
Medical Report
T20 World Cup
Cricket
Wankhede Stadium
BCCI

More Telugu News