కరవు ఏర్పడితే దానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: జీవన్ రెడ్డి
- తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించడంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదన్న జీవన్ రెడ్డి
- ప్రస్తుత అవసరాలకు మేడిగడ్డను పునరుద్ధరించడం ఒకటే మార్గమని సూచన
- తెలంగాణ పునర్నిర్మాణానికి కేసీఆర్ స్ఫూర్తిప్రదాత అని కితాబు
తెలంగాణలో భవిష్యత్తులో కరవు పరిస్థితులు ఏర్పడితే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి హెచ్చరించారు. జగిత్యాలలో బీఆర్ఎస్ నేత హరిచరణ్ రావు నివాసంలో జరిగిన భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రాణహిత జలాల వినియోగానికి తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించడంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదని జీవన్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుత సాగునీటి అవసరాలకు మేడిగడ్డ ప్రాజెక్టును తక్షణమే పునరుద్ధరించడం ఒక్కటే మార్గమని సూచించారు. ఇప్పటికే మూడు వ్యవసాయ సీజన్లు గడిచిపోయాయని, జాప్యం చేస్తే రైతులకు తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ పునర్నిర్మాణానికి కేసీఆర్ స్ఫూర్తిప్రదాత అని, మేడిగడ్డలో చిన్న సాంకేతిక లోపాన్ని అడ్డం పెట్టుకుని ఆయనను దోషిగా చిత్రీకరించడం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేడిగడ్డ పనులు పూర్తి చేయకపోతే రాబోయే కరవుకు కాంగ్రెస్ పార్టీయే జవాబుదారీ కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.