పోలీసు వాహనం ఢీకొని ఏఎస్ఐ మృతి.. పాత కక్షలతోనే హత్యని కుటుంబం ఆరోపణ

సంగారెడ్డి జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న ఓ ఏఎస్ఐని పోలీసు వాహనం ఢీకొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. మానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. మానూర్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్న గోవింద్ నాయక్ విధుల్లో ఉన్న సమయంలో హోంగార్డు రామారావు నడుపుతున్న పోలీసు వాహనం అదుపుతప్పి నేరుగా గోవింద్ నాయక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది ఆయనను నారాయణఖేడ్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.

అయితే, ఈ ఘటనపై మృతుని కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, పాత కక్షల నేపథ్యంలో హోంగార్డు రామారావు కావాలనే వాహనంతో ఢీకొట్టి హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రామారావు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సొంత శాఖలోనే ఓ అధికారి ఇలా అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం పోలీసు వర్గాల్లో కలకలం రేపింది.

Govind Nayak
Sangareddy
ASI Death
Police Vehicle Accident
Homicide Allegations
Manur Police Station
Home Guard Ramarao
Narayankhed
Telangana Police

More Telugu News