ఆశాజీ... మీ స్వరానికి మరణం లేదు!: ఏపీ మంత్రి నారా లోకేశ్

లెజెండరీ గాయని ఆశా భోంస్లే తీవ్ర అస్వస్థతతో కన్నుమూయడం పట్ల ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె భౌతికంగా లేకపోయినా, ఆమె పాటలు జీవించే ఉంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు. 

"సంగీత ప్రపంచం ఒక స్వర దేవతను కోల్పోయింది. ప్రఖ్యాత గాయని, లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే ఇక లేరన్న వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది. ఈ నష్టం కేవలం సంగీత పరిశ్రమకు మాత్రమే కాదు, నా లాంటి కోట్లాది మంది అభిమానులకు కూడా తీరనిది.

దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు తన మధురమైన గాత్రంతో, ఎన్నో భావాలను పలికించిన పాటలతో భారతీయ భాషల శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేశారు ఆశాజీ. ఆమె పాట వినని రోజు, ఆమె స్వరాన్ని గుర్తుచేసుకోని సంగీత ప్రియుడు ఉండరు. ఆమె పాడిన ప్రతి పాట ఒక ఆణిముత్యం. ఆమె గాత్రంలోని వైవిధ్యం, భావం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.

భౌతికంగా ఆశాజీ ఈ రోజు మన మధ్య లేకపోవచ్చు. కానీ, ఆమె పాటల రూపంలో ఎప్పటికీ మనతోనే జీవించి ఉంటారు. గాలిలో తేలియాడే ప్రతి స్వరంలో, మనం హమ్ చేసుకునే ప్రతి గీతంలో ఆమె బతికే ఉంటారు. ఆ మధుర స్వరం మన జ్ఞాపకాలలో ఎప్పటికీ పదిలంగా ఉంటుంది.

ఇంతటి గొప్ప గాయని మృతి పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి. ఆశాజీ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ లోకేశ్ స్పందించారు. 

Nara Lokesh
Asha Bhosle
Telugu Desam Party
Indian singer
playback singer
Nara Lokesh condolences
Asha Bhosle death
AP Minister
Telugu news
music industry

More Telugu News