గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్... కొత్తగా 25 వేల మంది ఫ్రెషర్లకు అవకాశం

దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తమ నియామక ప్రణాళికలను వెల్లడించింది. ఈ ఏడాదిలో సుమారు 25 వేల మంది ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు ప్రకటించింది. అయితే, మార్కెట్లో డిమాండ్ పెరిగితే ఈ సంఖ్యను మరింత పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని కంపెనీ స్పష్టం చేసింది.

గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో టీసీఎస్ 44 వేల మంది ఫ్రెషర్లకు అవకాశాలు కల్పించింది. గత మూడేళ్లుగా ఏటా సగటున 40 వేల మందికి పైగా కొత్తవారిని నియమించుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజా నియామకాలపై కంపెనీ ఎండీ, సీఈఓ కృతి వాసన్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకున్నారు. వ్యాపార అవసరాలకు అనుగుణంగా నియామక వ్యూహాలు మారుతుంటాయని ఆయన తెలిపారు.

ఫ్రెషర్లకు శిక్షణ ఇచ్చి ప్రాజెక్టులకు సిద్ధం చేయడానికి సుమారు 9 నెలల సమయం పడుతుందని, అదే అనుభవజ్ఞులైన ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరిపోతారని కృతి వాసన్ వివరించారు. గత ఏడాది సీనియర్ ఉద్యోగుల తొలగింపుల గురించి ప్రస్తావించగా, భవిష్యత్తులో అలాంటి తొలగింపులు ఉండవని ఆయన హామీ ఇచ్చారు. మంచి పనితీరు కనబరిచే ఉద్యోగులకు ఎలాంటి ఢోకా ఉండదని, ఖర్చుల తగ్గింపు లేదా ఏఐ కారణంగా తొలగింపులు జరగలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

TCS
Tata Consultancy Services
IT jobs
Kriti Vasn
Freshers recruitment
India IT sector
IT hiring
Job opportunities
TCS recruitment 2024

More Telugu News