ఏటీఎంలలో పెట్టాల్సిన రూ.1.20 కోట్లతో కస్టోడియన్లు జంప్!

ఏటీఎంలలో డబ్బులు నింపాల్సిన కస్టోడియన్లు ఏకంగా రూ.1.20 కోట్లను స్వాహా చేసి పరారయ్యారు. సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేసే ‘సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్’ అనే సంస్థ నిర్వహించిన అంతర్గత ఆడిటింగ్‌లో ఈ భారీ మోసం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. సీఎంఎస్ సంస్థ వివిధ బ్యాంకుల ఏటీఎంలలో నగదు నింపే కాంట్రాక్టును నిర్వహిస్తోంది. ఇటీవల ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 31 ఏటీఎంలలో సంస్థ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 8 ఏటీఎంలలో నగదు తక్కువగా ఉండటంతో అధికారులు కంగుతిన్నారు. మొత్తం రూ. 1,20,98,500 తేడా ఉన్నట్టు గుర్తించారు.

ఈ 8 ఏటీఎంల బాధ్యతలు చూస్తున్న ఇద్దరు కస్టోడియన్లపైనే సంస్థ యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది. గత కొన్ని రోజులుగా వారు విధులకు హాజరుకాకపోవడం, వారి ఫోన్లు స్విచ్చాఫ్ చేసి ఉండటంతో వారే ఈ సొమ్మును కాజేసి ఉంటారని భావిస్తున్నారు. నిందితులు ఒకేసారి కాకుండా, విడతల వారీగా నగదును పక్కదారి పట్టించి ఉంటారని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. సంస్థ బ్రాంచ్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏటీఎం కేంద్రాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

CMS Info Systems
CMS Info Systems Limited
ATM fraud
custodians absconding
Hyderabad crime
SR Nagar police
ATM cash theft
cash management services
financial crime

More Telugu News