పుట్టినరోజు నాడే అమెరికాలో బొబ్బిలి టెక్కీ మృతి

ఎంతో సంతోషంగా జరుపుకోవాల్సిన పుట్టినరోజే అతడి పాలిట చివరి రోజైంది. ఉన్నత భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన ఆ యువ ఇంజనీర్, తన పుట్టినరోజు నాడే అనుమానాస్పద స్థితిలో మరణించాడు. కుటుంబానికి అండగా నిలుస్తాడనుకున్న కొడుకు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వివరాల్లోకి వెళితే.. బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన గొర్లె సాయికుమార్ (28) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. చదువు పూర్తయ్యాక అక్కడే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం సంపాదించుకున్నాడు. దీంతో తమ కష్టాలు గట్టెక్కాయని అతడి తల్లిదండ్రులు రమ, శ్రీనివాస్ ఎంతో సంతోషించారు. అయితే, వారికి ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఉద్యోగంలో చేరి మూడు నెలలు మాత్రమే అయింది. ఈ క్రమంలోనే శనివారం సాయికుమార్ పుట్టిన రోజు కావడంతో రోజంతా స్నేహితులతో కలిసి సంతోషంగా గడిపాడు.

అయితే ప్రమాదవశాత్తూ సాయంత్రం చెరువులో మునిగి చనిపోయాడు. కుమారుడి అకాల మరణవార్త తెలియగానే బొబ్బిలిలోని ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికి అందివచ్చిన కొడుకు ఇక లేడనే వార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు అమెరికాలోని తెలుగు సంఘాలు, సాయికుమార్ స్నేహితులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని సహాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

Gorle Sai Kumar
Sai Kumar
Bobbili
Andhra Pradesh
USA
Software Engineer
Accidental Death
Drowning
Telugu Association
Pirdi Village

More Telugu News