చెపాక్‌లో సంజూ శాంసన్ మెరుపు సెంచరీ... చెన్నై భారీ స్కోరు!

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుత సెంచరీతో మెరిశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సంజూ విధ్వంసక సెంచరీతో కదం తొక్కాడు. కేవలం 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 115 పరుగులు సాధించి చెన్నై భారీ స్కోరుకు బాటలు వేశాడు. అతని అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు ఆయుష్ మాత్రే అర్ధశతకంతో రాణించడంతో, చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కాగా, ఐపీఎల్ లో సంజూ శాంసన్ కు ఇది నాలుగో సెంచరీ. ఈ సీజన్ లో మొదటిది. 

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, అతని నిర్ణయం సరైంది కాదని చెన్నై బ్యాటర్లు నిరూపించారు. ఇన్నింగ్స్ ఆరంభంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (18 బంతుల్లో 15) నెమ్మదిగా ఆడి 62 పరుగుల వద్ద తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు ఆయుష్ మాత్రేతో కలిసి సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా శాంసన్ బౌండరీలతో విరుచుకుపడగా, మాత్రే అతనికి చక్కటి సహకారం అందించాడు.

ఈ క్రమంలో రెండో వికెట్‌కు 113 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. మాత్రే కూడా కేవలం 36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అతను 'రిటైర్డ్ అవుట్'‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే (10 బంతుల్లో 20 నాటౌట్) తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. శాంసన్‌తో కలిసి ఆఖరి 15 బంతుల్లోనే 37 పరుగులు జోడించాడు.

మరోవైపు, ఢిల్లీ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. టి. నటరాజన్ 4 ఓవర్లలో ఏకంగా 54 పరుగులు సమర్పించుకోగా, లుంగి ఎంగిడి 41 పరుగులు ఇచ్చాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసినప్పటికీ, 39 పరుగులు ఇచ్చి ఖరీదైన బౌలర్‌గా నిలిచాడు. 

Sanju Samson
Sanju Samson century
Chennai Super Kings
Delhi Capitals
IPL 2024
Ayush Mathre
Ruturaj Gaikwad
MA Chidambaram Stadium
T Natarajan
Axar Patel

More Telugu News