అమెరికాలోని యూట్యూబ్ ప్రీమియం యూజర్లకు షాక్.. పెరిగిన సబ్‌స్క్రిప్షన్ ధరలు

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ తన ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు స్ట్రీమింగ్ సంస్థలు తమ ధరలను పెంచుతున్న నేపథ్యంలో, యూట్యూబ్ కూడా అదే బాట పట్టింది. ఈ నిర్ణయంతో ప్రకటనలు లేకుండా వీడియోలు చూసేందుకు చెల్లించాల్సిన మొత్తం మరింత భారంగా మారనుంది.

అమెరికాలో యూట్యూబ్ ప్రీమియం ఇండివిడ్యువల్ ప్లాన్ ధరను 2 డాలర్లు పెంచి 13.99 డాలర్లకు (సుమారు రూ. 1,170) చేర్చింది. అదేవిధంగా, ఫ్యామిలీ ప్లాన్‌పై 5 డాలర్లు పెంచి 22.99 డాలర్లుగా (సుమారు రూ. 1,920) నిర్ణయించింది. ఈ పెంచిన ధరలు కొత్త, పాత సబ్‌స్క్రైబర్లందరికీ వర్తిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.

పెరుగుతున్న కంటెంట్ ఖర్చులు, సబ్‌స్క్రైబర్లకు మెరుగైన ఫీచర్లు అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ పేర్కొంది. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు ప్రీమియం సేవలను కూడా ఒక ముఖ్యమైన ఆదాయ వనరుగా మార్చుకోవాలని యూట్యూబ్ లక్ష్యంగా పెట్టుకుంది.

అయితే, టీవీ వీక్షకుల కోసం 90 సెకన్ల నిడివి గల స్కిప్ చేయలేని ప్రకటనలు తీసుకువస్తున్నారనే ప్రచారాన్ని యూట్యూబ్ ఖండించింది. అలాంటి ఆలోచన ఏదీ ప్రస్తుతం లేదని స్పష్టం చేసింది. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ వంటి ప్రధాన స్ట్రీమింగ్ సేవలు కూడా ఇటీవలే తమ సబ్‌స్క్రిప్షన్ ఫీజులను పెంచాయి.

ప్రస్తుతానికి ఈ ధరల పెంపు అమెరికాకు మాత్రమే పరిమితం. భారత్ వంటి దేశాల్లోని ధరలపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. 2024లో భారత్‌లో ధరలను సవరించినప్పటికీ, అమెరికాతో పోలిస్తే ఇక్కడ ప్లాన్‌ల ధరలు ఇంకా తక్కువగానే ఉన్నాయి. భవిష్యత్తులో ఇతర దేశాల్లోనూ ధరలు పెంచుతారా? లేదా? అనే విషయంపై యూజర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

YouTube Premium
YouTube
YouTube price hike
video streaming
subscription cost
Netflix
Disney Plus
Google Alphabet

More Telugu News