నేడు ఏపీ కేబినెట్ భేటీ ..ఈ కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రానికి పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతి సహా పలు కీలక అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా సుమారు రూ.39,436 కోట్ల విలువైన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలవనుంది.

రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 31 ప్రాజెక్టులకు కేబినెట్ లాంఛనంగా ఆమోదముద్ర వేయనుంది. వీటితో పాటు, విద్యా రంగంలో ఫీజుల నియంత్రణ కోసం ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఎఫ్ఆర్‌సీ) ఏర్పాటుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అమరావతిలో ఏర్పాటు చేయనున్న ‘క్వాంటమ్ వ్యాలీ’లో మూడు సంస్థల స్థాపనపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.

రాజధాని అమరావతి నిర్మాణం, వివిధ సంస్థలకు భూముల కేటాయింపులపై కూడా సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం 28 జిల్లాలకు కొత్త జోనల్ వ్యవస్థను ఖరారు చేసే అంశం కూడా ఎజెండాలో ఉంది. భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు, బదిలీలు ఈ కొత్త విధానంలోనే జరగనున్నాయి. అమరావతికి రాజధాని హోదా కల్పిస్తూ పార్లమెంట్‌లో చట్టం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ కేబినెట్ తీర్మానం చేసే అవకాశం ఉంది.

కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం, ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో రాజకీయ అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజల్లోకి వెళ్లాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
 

Chandrababu Naidu
Andhra Pradesh Cabinet
AP Cabinet Meeting
Amaravati construction
Andhra Pradesh investments
Fee Regulatory Committee
Quantum Valley
Andhra Pradesh new zones

More Telugu News