ఆలయాల్లోకి కొందరికే ప్రవేశమా?.. హిందూమతానికే మంచిది కాదు: సుప్రీంకోర్టు

సమాజంలోని కొన్ని వర్గాలను ఆలయాలు, మఠాల్లోకి రానివ్వకుండా అడ్డుకోవడం హిందూమతానికే నష్టం కలిగిస్తుందని, సామాజిక విభజనకు దారితీస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి పద్ధతులు దీర్ఘకాలంలో మతానికే ప్రతికూలంగా మారతాయని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది.

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కేసు నుంచి ఉద్భవించిన మత స్వేచ్ఛ, వివక్షకు సంబంధించిన పిటిషన్లపై ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా కొన్ని వర్గాలకు చెందిన ఆలయాల్లోకి కేవలం ఆ వర్గం వారినే అనుమతించాలని, బయటివారికి ప్రవేశంపై నియంత్రణ విధించే హక్కు తమకుందని నాయర్ సర్వీస్ సొసైటీ తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదించారు.

ఈ వాదనపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జస్టిస్ బీవీ నాగరత్న మాట్లాడుతూ.. "ప్రతి ఒక్కరికీ ప్రతి ఆలయంలో, మఠంలో ప్రవేశం ఉండాలి. ఇతరులను అనుమతించకుండా కేవలం మా వర్గం వారే వస్తారనడం హిందూమతానికి మంచిది కాదు. దీనివల్ల ఆ మతానికే నష్టం వాటిల్లుతుంది" అని వ్యాఖ్యానించారు. ఇలాంటి పద్ధతులు సమాజాన్ని విభజిస్తాయని జస్టిస్ అరవింద్ కుమార్ కూడా అభిప్రాయపడ్డారు.

2018లో శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తీర్పుపై దాఖలైన సమీక్ష పిటిషన్లను విచారించిన మరో ధర్మాసనం, మత స్వేచ్ఛకు సంబంధించిన విస్తృత రాజ్యాంగపరమైన ఏడు ప్రశ్నలను ప్రస్తుత తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది. ప్రస్తుతం ఈ ధర్మాసనం కేవలం ఒక్క కేసుకే పరిమితం కాకుండా రాజ్యాంగం ప్రకారం మత స్వేచ్ఛ పరిధిపై విస్తృత స్థాయిలో విచారణ జరుపుతోంది.

Supreme Court
Hinduism
temple entry
Sabarimala
religious freedom
social division
Justice Nagarathna
Nair Service Society
discrimination

More Telugu News