తమ మంత్రి కంపెనీలో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రే చెప్పారు: హరీశ్ రావు

తమ మంత్రి కంపెనీలో జరిగిన అవినీతిని తమ అధికారులే గుర్తుపట్టారని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనుమతులు లేకుండానే నడుపుతున్నారని రాఘవ కన్ స్ట్రక్షన్స్‌కు అధికారులు నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు.

పొంగులేటికి చెందిన ఈ కంపెనీలో అవినీతి జరిగిందని సీఎం చెప్పడం, అధికారులు నోటీసులు ఇవ్వడం తప్పా లేక తన కంపెనీపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పింది తప్పా అని ప్రశ్నించారు. నాలుగు శాఖలకు చెందిన అధికారులు ఈ కంపెనీకి మూడుసార్లు నోటీసులు ఇచ్చారని తెలిపారు. తన కంపెనీ విషయంలో ముఖ్యమంత్రి తప్పు చెప్పారని సభలోనే పొంగులేటి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఆయన పొంగులేటి కాదని, పొంగు'లూటీ' అని ఎద్దేవా చేశారు.

నాదర్‌‌గుల్ భూముల వ్యవహారం గురించి మాట్లాడుతూ, రెండున్నరేళ్లుగా ఆ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. అది ప్రభుత్వ భూమి అయితే స్వాధీనం చేసుకోకుండా హైడ్రా ఏం చేస్తోందని నిలదీశారు. హైడ్రా కేవలం పేదల ఇళ్ల పైకి మాత్రమే వెళుతుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Harish Rao
Revanth Reddy
Ponguleti Srinivas Reddy
BRS
Telangana Assembly
Raghav Constructions

More Telugu News