సీఎం చంద్రబాబుతో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ.. కీలక సమస్యలపై వినతి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు కీలక సమస్యలను ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక వినతిపత్రం అందజేశారు.

ముఖ్యంగా నెల్లూరు, ఒంగోలు, బాపట్ల తీరప్రాంతాల్లోని మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను మాధవ్ సీఎంకు వివరించారు. పొరుగున ఉన్న తమిళనాడుకు చెందిన మత్స్యకారులు స్పీడ్ బోట్లతో ఏపీ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి మత్స్య సంపదను దోచుకుంటున్నారని తెలిపారు. దీనివల్ల స్థానిక మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినడంతో పాటు శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

అదేవిధంగా, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న హోంగార్డుల సంక్షేమం గురించి కూడా మాధవ్ ప్రస్తావించారు. మానవతా దృక్పథంతో హోంగార్డులకు అంతర్రాష్ట్ర బదిలీలు చేపట్టాలని కోరారు. ఈ సమస్య కారణంగా సుమారు 400 మంది హోంగార్డులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ భేటీకి సంబంధించిన వివరాలను పీవీఎన్ మాధవ్ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన సీనియర్ సిటిజన్ కార్డులు, 'ఆయుష్మాన్ వయో వందన కార్డ్'లను పలు ప్రైవేట్ ఆసుపత్రులు అంగీకరించడం లేదని, దీనివల్ల వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని కూడా తాను సీఎంకు విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, వాటిని పరిశీలించి శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
 

PVN Madhav
Chandrababu Naidu
AP BJP Chief
Andhra Pradesh
Fishermen problems
Home guards
Senior citizen cards
Ayushman Vayo Vandana Card
Nellore
Ongole

More Telugu News