హరీశ్ రావు బహిరంగసభకు అనుమతుల రద్దు
వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా గత 100 రోజులుగా సాగుతున్న రైతుల పోరాటం ఉద్రిక్తంగా మారింది. రైతులకు మద్దతుగా ఈ నెల 9న నిర్వహించాలనుకున్న హరీశ్రావు బహిరంగ సభకు ప్రభుత్వం అకస్మాత్తుగా అనుమతులు రద్దు చేయడం రాజకీయ దుమారానికి దారితీసింది.
ప్రభుత్వం తొలుత అనుమతినిచ్చి, సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక వెనక్కి తగ్గడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకను నొక్కేయాలని చూడటం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా, తాము వెనక్కి తగ్గేది లేదని, హైకోర్టును ఆశ్రయించి సభకు అనుమతులు తెచ్చుకుంటామని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు, కేసులు కొత్త కాదని... బెదిరింపులకు భయపడి ఉంటే తెలంగాణ వచ్చేదే కాదని నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతాంగ ప్రయోజనాల కోసం తమ పోరాటం కొనసాగుతుందని, ఈ నెల 9న హరీశ్రావు సభను జరిపి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.