ఈ రోజు మాకు ఎమోషనల్ డే: పవన్ కల్యాణ్ భార్య అన్నాలెజినోవా

ఏప్రిల్ 8న తన కుటుంబానికి ఎమోషనల్ డే అని ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ భార్య అన్నాలెజినోవా పేర్కొన్నారు. నేడు అకీరా పుట్టినరోజు అని గుర్తు చేసుకున్న ఆమె, గత సంవత్సరం ఇదే రోజున మార్క్ శంకర్‌కు అగ్ని ప్రమాదంలో గాయాలు అయ్యాయని తెలిపారు. అందుకే ఈరోజు ఇద్దరి పుట్టినరోజును జరుపుకుంటామని వెల్లడించారు.

సరిగ్గా ఏడాది క్రితం సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ చిక్కుకుపోవడంతో తాము వణికిపోయామని అన్నారు. అతను ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతమని పేర్కొన్నారు. ఆ ప్రమాదం నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారని అన్నారు. మార్క్‌కు ఇది పునర్జన్మ అన్నారు.

అలాగే అకీరా నందన్ పుట్టినరోజు కూడా ఇదే రోజు. అందుకే ఈ రోజును ఎప్పటికీ మరిచిపోమని అన్నారు. అకీరా ఎదుగుతున్న తీరు తమకు చాలా గర్వకారణమని పేర్కొన్నారు. ప్రతి విషయాన్ని అతను లోతుగా తెలుకునే ప్రయత్నం చేస్తాడని అన్నారు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుందని అన్నారు. అందుకే ఈరోజు ఇద్దరు అబ్బాయిలకు సంబంధించి సంబరాలు చేసుకుంటామని అన్నారు.

సింగపూర్‌లో అగ్ని ప్రమాదం జరిగి ఏడాదైనా ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని అన్నాలెజినోవా పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో పదేళ్ల చిన్నారి మరణానికి, 18 మంది పిల్లలు ఆసుపత్రి పాలు కావడానికి కారణమెవరో ఇప్పటికీ తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు పిల్లలకు సర్జరీలు అయ్యాయని, వాళ్లు ఇప్పటికీ ఎంతో బాధ అనుభవిస్తున్నారని అన్నారు. దేవుడి దయ వల్ల మార్క్ ప్రాణాలతో బయటపడ్డారని అన్నారు.

మార్క్ శంకర్ ఆరోజు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిపడిన క్షణాలు తనను కలవరపాటుకు గురి చేశాయని, ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకున్నారు. నాటి ప్రమాదం సందర్భంగా పిల్లలను కాపాడిన కార్మికులకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె ప్రమాదానికి సంబంధించిన ఫొటోలను, అలాగే తిరుమలలో తాను శ్రీవారికి తలనీలాలు సమర్పించిన ఫొటోను పంచుకున్నారు.

Anna Lezhneva
Pawan Kalyan
Akira Nandan
Mark Shankar
Singapore fire accident
Akira birthday

More Telugu News