రణ్‌బీర్ 'రామాయణం' వీఎఫెక్స్‌పై ట్రోలింగ్.. మౌనం వీడిన నిర్మాత

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణం' సినిమా వీఎఫెక్స్‌పై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, ట్రోలింగ్స్‌పై నిర్మాత నమిత్ మల్హోత్రా స్పందించారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న అభిప్రాయాలను గౌరవిస్తున్నామని, కచ్చితంగా మెరుగైన అవుట్‌పుట్‌తో ముందుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియాలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

"కొన్ని రోజులుగా వస్తున్న స్పందన మమ్మల్ని మరింత ఉత్తేజపరిచింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాల్లో నిలిచిన రాముడి కథ ఇది. అందరి అభిప్రాయాలను, సూచనలను మేము స్వీకరిస్తున్నాం. వేలాది మంది కళాకారులు ఈ సినిమా కోసం ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నారు. అందరి అంచనాలకు తగ్గట్టుగా, ఉన్నత ప్రమాణాలతో సినిమాను అందిస్తాం" అని నమిత్ తన నోట్‌లో పేర్కొన్నారు.

ఇటీవల 'రామాయణం' నుంచి రాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్ ఫస్ట్ లుక్‌కు సంబంధించిన కొన్ని విజువల్స్ బయటకు వచ్చాయి. అయితే, అందులోని వీఎఫెక్స్ నాణ్యత చాలా పేలవంగా ఉందని నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. ఏఐ టూల్స్ ఉపయోగించి గ్రాఫిక్స్ చేశారని, బడ్జెట్ లెక్కలు తప్పు చూపిస్తున్నారని ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో నిర్మాత స్పందించారు. కాగా, ఈ సినిమా వీఎఫెక్స్ బాధ్యతలను నమిత్ మల్హోత్రాకు చెందిన ఆస్కార్ విన్నింగ్ సంస్థ డీఎన్ఈజీ (DNEG) చూడటం గమనార్హం.

నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్‌, సన్నీ డియోల్, రవి దూబే వంటి భారీ తారాగణం నటిస్తోంది. ఎ.ఆర్. రెహమాన్‌తో పాటు ఆస్కార్ విజేత హన్స్ జిమ్మెర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Ranbir Kapoor
Ramayana
Namit Malhotra
Nitesh Tiwari
Sai Pallavi
Yash
Sunny Deol
VFX Trolling
DNEG
Indian Mythology Film

More Telugu News