బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మార్పు మొదలవుతుంది: అమిత్ షా

పశ్చిమ బెంగాల్‌లో ఒక్కసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మార్పు మొదలవుతుందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. అసోంలోని బరాక్ లోయలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్‌లో అభివృద్ధి జరగాలన్నా, అక్రమ చొరబాటుదారులను తరిమికొట్టాలన్నా అది బీజేపీకే సాధ్యమని అన్నారు.

అసోంలోని బరాక్ ప్రాంతంలో బెంగాలీలు ఎక్కువగా ఉంటారు. దీనితో ఆయన ఇక్కడ చొరబాటుల అంశాన్ని ప్రస్తావించారు.

పౌరసత్వ చట్టసవరణ ప్రకారం గూఢచర్యం చేసే వ్యక్తులకు దేశంలో స్థానం లేదని అన్నారు. కానీ ఈ చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ కార్పెట్ వేసి మరీ అక్రమ చొరబాటుదారులకు ప్రవేశం కల్పిస్తోందని విమర్శించారు. అక్రమ చొరబాటుదారులకు ఆశ్రయమిచ్చేందుకు భారత్ ఏమీ ధర్మసత్రం కాదని వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో బీజేపీకి అధికారం ఇస్తే మార్పు చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.

బెంగాల్‌లో ఇప్పటికే తిష్టవేసిన చొరబాటుదారులను వారి దేశానికి తరిమికొడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులకు అసలు ప్రజల కష్టాలు తెలుసుకోవాలనే ఉద్దేశం ఉండదని విమర్శించారు. రాహుల్ గాంధీ నిరసనకారులను కూడా ప్రశంసిస్తారని ఎద్దేవా చేశారు. అస్సామీ, బెంగాలీలను సంప్రదాయ భాషలుగా ప్రకటించేందుకు మోదీ ఆలోచన చేస్తున్నారని తెలిపారు.

Amit Shah
West Bengal
BJP
Assam
Illegal Immigration
Citizenship Amendment Act
CAA
Elections

More Telugu News