Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి... గెజిట్ విడుదల చేసిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తి చట్టబద్ధత ఏర్పడింది. అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నేడు అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత కేంద్ర న్యాయశాఖ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయడంతో అమరావతికి సంపూర్ణ చట్టబద్ధత లభించినట్లయింది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతి రాజధాని సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిన విషయం తెలిసిందే. అక్కడ లోక్‌సభ, రాజ్యసభ రెండూ ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడంతో, దీనికి అధికారిక ముద్ర పడింది. ఈ ప్రక్రియలన్నీ పూర్తవడంతో కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్ జారీ చేసింది. 

2014 నాటి సీఆర్డీయే చట్టంలో పొందుపరిచిన అమరావతిని రాజధానిగా నోటిఫై చేస్తున్నట్లు ఇందులో స్పష్టం చేసింది. ఈ సవరణ చట్టం 2024 జూన్ 2వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లుగా (retrospective effect) గెజిట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 5, సబ్-సెక్షన్ (2)లో ఉన్న "కొత్త రాజధాని ఉంటుంది" (a new capital) అనే పదబంధం స్థానంలో "అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది" (Amaravati shall be the new capital) అని మార్పు చేశారు.

ఈ సవరణ ద్వారా 'అమరావతి' అనే పదానికి కూడా చట్టంలో స్పష్టత ఇచ్చారు. 'అమరావతి' అనగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) చట్టం, 2014 నిబంధనల ప్రకారం నోటిఫై చేయబడిన రాజధాని నగర ప్రాంతాలు అని వివరణ జోడించారు. రాష్ట్రపతి ఆమోదం, గెజిట్ ప్రచురణతో ఈ చట్ట సవరణ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చినట్లయింది. 



 
Amaravati
Andhra Pradesh capital
AP capital
Central government gazette
AP Assembly
CRDA Act
Droupadi Murmu
Andhra Pradesh news
capital city
legal status

More Telugu News