Jayaraj Bennix: ఒకేసారి 9 మంది పోలీసులకు ఉరిశిక్ష... మధురై కోర్టు సంచలన తీర్పు

 దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తమిళనాడులోని సాతంకుళం కస్టడీ మరణాల కేసులో మధురై కోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. తండ్రీకొడుకులైన జయరాజ్, బెన్నిక్స్‌ల మృతికి కారణమైన తొమ్మిది మంది పోలీసులను దోషులుగా తేల్చి, వారికి మరణ శిక్ష విధించింది. సోమవారం మదురై మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి జి. ముత్తుకుమారన్ ఈ తీర్పును ప్రకటించారు. ఈ కేసును "అత్యంత అరుదైన కేసు" (రేర్ ఆఫ్ ది రేరెస్ట్)గా అభివర్ణించిన న్యాయమూర్తి, రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ కేసులో దోషులుగా తేలిన వారిలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్. శ్రీధర్, సబ్ ఇన్‌స్పెక్టర్లు పి. రఘు గణేశ్, కె. బాలకృష్ణన్, హెడ్ కానిస్టేబుల్స్ ఎస్. మురుగన్, ఏ. సామిదురై, కానిస్టేబుల్స్ ఎం. ముత్తురాజ్, ఎస్. చెల్లదురై, థామస్ ఫ్రాన్సిస్, ఎస్. వెయిలుముత్తు ఉన్నారు. విచారణ సమయంలో పదో నిందితుడైన రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాల్‌దురై కోవిడ్‌తో మరణించాడు.

కేసు నేపథ్యం: 2020 జూన్ 19న, కోవిడ్-19 లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రాత్రి 9 గంటల తర్వాత దుకాణం తెరిచి ఉంచారనే ఆరోపణలతో సాతంకుళం పోలీసులు వ్యాపారులైన పి. జయరాజ్, ఆయన కుమారుడు బెన్నిక్స్‌ను అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్‌లో వారిని అత్యంత అమానుషంగా, క్రూరంగా హింసించినట్టు ఆరోపణలు ఉన్నాయి. తీవ్ర గాయాలపాలైన వారిపై తప్పుడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ హింస కారణంగా బెన్నిక్స్ జూన్ 22న, జయరాజ్ జూన్ 23న చికిత్స పొందుతూ మరణించారు. ఎలాంటి నేరచరిత్ర లేని వారి మరణం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.

మొదట మదురై హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించగా, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. సీబీఐ విచారణలో పోలీసుల దారుణాలు బయటపడ్డాయి. పోస్ట్‌మార్టం నివేదికలు కూడా వారిద్దరి మరణానికి తీవ్రమైన గాయాలే కారణమని స్పష్టం చేశాయి. సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, మార్చి 23న తొమ్మిది మందిని దోషులుగా నిర్ధారించి, సోమవారం వారికి శిక్ష ఖరారు చేసింది. దోషులందరికీ మరణ శిక్షతో పాటు, బాధిత కుటుంబానికి రూ.1.40 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. 
Jayaraj Bennix
Sathankulam custodial deaths
Tamil Nadu police
Madurai court verdict
Police brutality India
Custodial death case
Justice for Jayaraj and Bennix
India police violence
Murder case India
G Muthukumaran

More Telugu News