UPI: యూపీఐ దూకుడు... 2025లో 33 శాతం పెరిగిన లావాదేవీలు!

భారత్‌లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. 2025 సంవత్సరంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా జరిగిన లావాదేవీలు 33 శాతం వృద్ధి చెంది 228.5 బిలియన్లకు చేరాయి. ఈ లావాదేవీల మొత్తం విలువ రూ.299.74 ట్రిలియన్లుగా నమోదైంది. ఈ వివరాలను 'వరల్డ్‌లైన్' సోమవారం విడుదల చేసిన తన నివేదికలో వెల్లడించింది.

నివేదిక ప్రకారం, వ్యాపారులకు జరిపిన చెల్లింపులు (P2M) 34 శాతం పెరిగి 143.82 బిలియన్లకు చేరాయి. మరోవైపు, యూపీఐ సగటు లావాదేవీ విలువ (యావరేజ్ టికెట్ సైజ్) 9 శాతం తగ్గి రూ.1,314కు చేరింది. ముఖ్యంగా వ్యాపారుల వద్ద జరిపే చెల్లింపుల సగటు విలువ రూ.592కు పడిపోవడం గమనార్హం. గతంలో నగదుతో జరిపిన వీధి వ్యాపారుల వద్ద కొనుగోళ్ల వంటి చిన్న చిన్న చెల్లింపులు కూడా డిజిటల్ పరిధిలోకి వస్తున్నాయని ఇది సూచిస్తోందని నివేదిక పేర్కొంది.

డిజిటల్ చెల్లింపుల కోసం మౌలిక సదుపాయాలు కూడా భారీగా పెరిగాయి. 2025లో యూపీఐ క్యూఆర్ కోడ్‌ల సంఖ్య 15 శాతం పెరిగి 731.38 మిలియన్లకు చేరింది. "భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ పరిణితిలో కొత్త దశకు చేరుకుంటోంది," అని వరల్డ్‌లైన్ ఇండియా సీఈవో రమేష్ నరసింహన్ తెలిపారు.

మరోవైపు, భారత్ బిల్‌పే ద్వారా జరిగే రికరింగ్ చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. దీని లావాదేవీల సంఖ్య 40 శాతం పెరిగి 3.05 బిలియన్లకు, వాటి విలువ 93 శాతం వృద్ధితో రూ.14.84 ట్రిలియన్లకు చేరింది. ఎడ్యుకేషన్ ఫీజులు, బీమా, ఈఎంఐల వంటివి దీని ద్వారా చెల్లించడం పెరుగుతోందని నివేదిక వివరించింది. ఇదే సమయంలో క్రెడిట్ కార్డు లావాదేవీలు 27 శాతం పెరగ్గా, చిన్న లావాదేవీలు యూపీఐకి మళ్లడంతో డెబిట్ కార్డుల వాడకం 23 శాతం తగ్గింది.
UPI
Unified Payments Interface
Digital Payments India
Worldline Report
India Digital Economy
Bharat BillPay
QR Codes
Ramesh Narasimhan

More Telugu News