Rahul Dravid: ద్రావిడ్, కుంబ్లేలకు అరుదైన గౌరవం.. రెండు ఎండ్లకు దిగ్గజాల పేర్లు!
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్తో సరికొత్త చరిత్రకు వేదికైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన రసవత్తర పోరుకు ముందు భారత క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లేలకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం అరుదైన గౌరవాన్ని కల్పించింది.
స్టేడియంలోని రెండు ప్రధాన ఎండ్లకు ఈ ఇద్దరు దిగ్గజాల పేర్లను ఖరారు చేశారు. బీఈఎంఎల్ ఎండ్కు 'రాహుల్ ద్రావిడ్ ఎండ్' అని పేరు పెట్టారు. పెవిలియన్ ఎండ్కు 'అనిల్ కుంబ్లే ఎండ్' అని నామకరణం చేశారు. వీరితో పాటు మాజీ క్రికెటర్ శాంత రంగస్వామి పేరు మీద కూడా స్టాండ్ను ఏర్పాటు చేశారు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ద్రావిడ్ మాట్లాడుతూ... "ఈ స్టేడియం నాకు రెండో ఇల్లు లాంటిది. నేను ఈ స్థాయికి చేరుకున్నానంటే దానికి ఈ మైదానమే కారణం" అని కృతజ్ఞతలు తెలిపారు. అనిల్ కుంబ్లే మాట్లాడుతూ... "తొమ్మిదేళ్ల వయసులో ఇక్కడ తొలిసారి మ్యాచ్ చూశాను. నేడు అదే స్టేడియంలో పెవిలియన్ పైన నా పేరు చూడటం చాలా సంతోషంగా ఉంది" అని తన అనుబంధాన్ని పంచుకున్నారు.
భారత క్రికెట్కు వెన్నెముకగా నిలిచిన ద్రావిడ్ అంతర్జాతీయ కెరీర్లో 24,177 పరుగులు చేయగా, స్పిన్ మాంత్రికుడు కుంబ్లే అన్ని ఫార్మాట్లలో కలిపి 956 వికెట్లు పడగొట్టారు.
మరోవైపు, ఈ చారిత్రాత్మక ఘట్టం తర్వాత జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. నిర్ణీత ఓవర్లలో 250 పరుగుల భారీ స్కోరు సాధించిన బెంగళూరు, చెన్నైపై 43 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.