Toll Plazas: టోల్ ప్లాజాల వద్ద ఇకపై ‘నో క్యాష్’.. ఎప్పటి నుంచంటే..!

జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఇకపై టోల్ రుసుమును కేవలం డిజిటల్ పద్ధతుల్లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పులతో టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు తగ్గుముఖం పడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

తాజా నిబంధనల ప్రకారం, వాహనదారులు టోల్ రుసుమును ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఒకవేళ వాహనానికి ఫాస్టాగ్ లేకపోతే, యూపీఐ ద్వారా సాధారణ రుసుము కంటే 1.25 రెట్లు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. టోల్ ప్లాజాల వద్ద నగదు స్వీకరించే కౌంటర్లు పూర్తిగా మూసివేయనున్నారు.

అంతేకాకుండా, టోల్ మినహాయింపు కోసం తమ గుర్తింపు కార్డులను (ఐడీ కార్డులు) చూపించే విధానానికి కూడా ప్రభుత్వం స్వస్తి పలికింది. మినహాయింపు పరిధిలోకి వచ్చే ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు సైతం తమ వాహనాలకు తప్పనిసరిగా 'ఎగ్జెంప్టెడ్ ఫాస్టాగ్' తీసుకోవాలి. ఈ ప్రత్యేక ఫాస్టాగ్ లేని వాహనాలు టోల్ చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.

పొరపాటున టోల్ చెల్లించకుండా వెళ్లే వాహనాల నంబర్ ప్లేట్ ఆధారంగా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్‌కు ఈ-నోటీసు పంపుతారు. ఆ నోటీసు అందిన 72 గంటల్లోగా ఆన్‌లైన్‌లో బకాయి చెల్లిస్తే జరిమానా ఉండదు. ఆ గడువు దాటితే మాత్రం జరిమానా రెట్టింపు అవుతుంది. తరచూ ప్రయాణించే వారి సౌలభ్యం కోసం రూ. 3,075తో వార్షిక పాస్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, లావాదేవీలలో పారదర్శకత పెంచడం, సిబ్బంది-ప్రయాణికుల మధ్య వివాదాలను నివారించడమే ఈ నిర్ణయాల ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.
Toll Plazas
FASTag
UPI
Digital Payments
National Highways
e-Notice
Toll Exemption
Traffic Reduction

More Telugu News