RCB: సీఎస్‌కేతో మ్యాచ్‌కు ముందు శ్రీవారి సేవలో ఆర్సీబీ స్టార్లు.. టైటిల్ సెంటిమెంట్ రిపీట్!

ఐపీఎల్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పటీదార్, వికెట్ కీపర్ జితేశ్‌ శర్మ శనివారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు వారు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.

గతేడాది కూడా సీఎస్‌కేతో మ్యాచ్‌కు ముందు వీరిద్దరూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించడమే కాకుండా ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా టైటిల్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో అదే సెంటిమెంట్‌ను పునరావృతం చేస్తూ మరోసారి తిరుమల రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. శేషాచలం కొండలపై వెలసిన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని ఏటా కోట్లాది మంది భక్తులు దర్శించుకోవడం తెలిసిందే.

ఇటీవలే తండ్రి అయిన కెప్టెన్ పటీదార్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 12 బంతుల్లోనే 31 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానం కోల్పోయిన జితేశ్‌ శర్మ మాత్రం డకౌట్ అయి నిరాశపరిచాడు.

గత మ్యాచ్‌లో హైదరాబాద్ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ 15.4 ఓవర్లలోనే ఛేదించింది. విరాట్ కోహ్లి 69 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. బౌలింగ్‌లో జాకబ్ డఫీ, రొమారియో షెపర్డ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.
RCB
Rajat Patidar
Royal Challengers Bangalore
CSK
Chennai Super Kings
IPL 2026
Tirumala
Lord Venkateswara
Jitesh Sharma
Cricket

More Telugu News