AP Weather: ఏపీలో వడగాలుల హెచ్చరిక.. నేడు 73 మండలాల్లో తీవ్ర ప్రభావం

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. రానున్న రెండు రోజుల పాటు పలు మండలాల్లో తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ఈరోజు (శనివారం) శ్రీకాకుళంలో 16, విజయనగరంలో 24, పార్వతీపురం మన్యంలో 15, అల్లూరి జిల్లాలో 3, పోలవరం పరిధిలో 9, అనకాపల్లిలో 2, కాకినాడలో 3, తూర్పుగోదావరిలో 1 మండలంతో సహా మొత్తం 73 మండలాల్లో తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వివరించారు. మరో 17 మండలాల్లో సాధారణ వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఆదివారం కూడా 32 మండలాల్లో తీవ్రవడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేశారు.

శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో అత్యధికంగా 41.8 డిగ్రీలు, చిత్తూరు జిల్లా రాయలపేటలో 41.4 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా నాతవరంలో 40.9 ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

వడగాలుల నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ కోరారు. శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు ఓఆర్‌ఎస్‌ (ఒఆర్ఎస్), లస్సీ, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి ఎక్కువగా తాగాలని సూచించారు. తరచూ మంచినీరు తాగుతూ సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
 
AP Weather
Andhra Pradesh Heatwave
Heatwave Alert
Prahar Jain
APSDMA
Heatwave Warning
Summer Heat
India Weather
High Temperatures
Heatstroke Prevention

More Telugu News