Adnan Shareef: సొంత ఇంటికే కన్నం వేశాడు... జల్సాల కోసం!

హైదరాబాద్‌లో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఓ యువకుడు, తన స్నేహితులతో కలిసి సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన కొడుకు అద్నాన్ షరీఫ్‌తో పాటు అతడి ఇద్దరు స్నేహితులను కంచన్‌బాగ్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి బంగారం, కారు, ఖరీదైన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

కంచన్‌బాగ్‌లోని మహమ్మద్ షరీఫ్ నివాసంలో మార్చి 31న చోరీ జరిగింది. తన ఇంట్లోని బీరువాలో ఉన్న సుమారు 22 తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రహ్మత్ షరీఫ్ చిన్న కుమారుడైన అద్నాన్ షరీఫ్, జల్సాల కోసం డబ్బు అవసరం కావడంతో స్నేహితుల సహాయంతో ఈ దొంగతనానికి పాల్పడినట్లు తేలింది.

దొంగిలించిన బంగారాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో నిందితులు ఓ వెర్నా కారు, రెండు ఐఫోన్లు సహా నాలుగు ఖరీదైన సెల్‌ఫోన్లు కొనుగోలు చేశారు. నిందితుల నుంచి 13 తులాల బంగారం, కారు, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు.
 
Adnan Shareef
Hyderabad crime
Kanchabagh
theft
gold jewelry
luxury lifestyle
police investigation
Verna car
iphone

More Telugu News