Kadiyam Srihari: అన్నం పెట్టిన కేసీఆర్ గురించి కడియం శ్రీహరి తప్పుగా మాట్లాడారు: పాడి కౌశిక్ రెడ్డి

అన్నం పెట్టిన కేసీఆర్ గురించి కడియం శ్రీహరి తప్పుగా మాట్లాడారని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కడియం శ్రీహరికి కేసీఆర్ ఏం తక్కువ చేశారని ప్రశ్నించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ఆయనకు టిక్కెట్ ఇచ్చారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గత ఎన్నికల్లో పోటీ చేసిన కడియం శ్రీహరిని తాము మీరు ఏ పార్టీలో ఉన్నారని సభలో అడిగితే తప్పేమిటని ప్రశ్నించారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కేసీఆర్, హరీశ్ రావుపై విమర్శలు ఎందుకు చేశారో చెప్పాలని అన్నారు.

సభలో ఆయన కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల వద్ద కూర్చున్నారని, అందుకే అడిగామని వెల్లడించారు. అసలు ఆయన ఏ పార్టీ పక్షాన మాట్లాడుతున్నారో చెప్పాలని నిలదీశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో జరిగే మైనింగ్ కుంభకోణాన్ని హరీశ్ రావు అసెంబ్లీలో ఆధారాలతో సహా బయటపెట్టారని అన్నారు. మైనింగ్ స్కాం మీద హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. హౌస్ కమిటీ వేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న సమస్య ఏమిటని ప్రశ్నించారు.

సీఐడీ విచారణకు ఆదేశిస్తామని ప్రభుత్వం చెబుతోందని, మంత్రి మీద సీఐడీ విచారణ వేస్తే న్యాయం జరుగుతుందా అని నిలదీశారు. మంత్రిని అధికారులు విచారించే అవకాశం ఉంటుందా అని అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ తనను టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామని అన్నారు.
Kadiyam Srihari
Paadi Kaushik Reddy
KCR
BRS Party
Telangana Politics
Harish Rao
Mining Scam Telangana

More Telugu News