Naxalism: నక్సలిజం నిర్మూలనకు రేపటితో డెడ్‌లైన్.. బస్తర్‌లో ముమ్మర ఆపరేషన్లు

దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండేళ్ల క్రితం విధించిన గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో భద్రతా బలగాలు తమ ఆపరేషన్లను ముమ్మరం చేశాయి. నక్సలిజంపై పోరాటం తుది అంకానికి చేరుకుందని అధికారులు చెబుతున్నారు.

2013లో జీరం లోయలో కాంగ్రెస్ నేతలు సహా 32 మందిని మావోయిస్టులు హతమార్చిన జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతున్నా, గడిచిన పదేళ్లలో పరిస్థితి గణనీయంగా మారింది. ముఖ్యంగా 2024 నుంచి మావోయిస్టుల అగ్ర నాయకత్వానికి పెద్ద దెబ్బ తగిలింది. 2025లో మావోయిస్టు జనరల్ సెక్రటరీ బసవరాజు, మోస్ట్ వాంటెడ్ కమాండర్ హిడ్మా వంటి కీలక నేతలు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. గత ఏడాదిలోనే 317 మంది నక్సల్స్‌ను భద్రతాబలగాలు మట్టుబెట్టగా, 2000 మందికి పైగా లొంగిపోయారు. ఒకప్పుడు 126 జిల్లాల్లో విస్తరించిన నక్సల్ ప్రభావం నేడు కేవలం 7 జిల్లాలకే పరిమితమైంది.

ఈ గడువు ముగియడానికి ఒకరోజు ముందు, సోమవారం లోక్‌సభలో నక్సలిజం నిర్మూలనపై ప్రత్యేక చర్చ జరిగింది. టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే ఈ చర్చను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 130 నుంచి 150 మంది సాయుధ మావోయిస్టులు మాత్రమే మిగిలి ఉన్నారని నిఘా వర్గాల అంచనా. వీరిని ఏరివేసే లక్ష్యంతో 'కోబ్రా' ప్రత్యేక దళాలు ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ అడవుల్లో భారీ ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి.

గడువు ముగుస్తున్న వేళ, బస్తర్ ప్రాంతం త్వరలోనే ప్రశాంతతతో వికసిస్తుందని ఛత్తీస్‌గఢ్ మాజీ డీజీపీ విశ్వాసం వ్యక్తం చేశారు. సాయుధ పోరాటం ముగిసినా, హక్కుల కోసం శాంతియుత ఉద్యమాలు కొనసాగవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Naxalism
Amit Shah
Bastar
Chhattisgarh
Maoists
COBRA
Naxal eradication
Byreddy Shabari
Srikanth Shinde
Basavaraju

More Telugu News