Kaushik Reddy: కౌశిక్ రెడ్డి వ్యవహారం ఎథిక్స్ కమిటీకి సిఫారసు.. కఠిన చర్యలు తీసుకోవాలన్న రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పి. కౌశిక్ రెడ్డి వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. సీనియర్ సభ్యుడు, దళిత నేత కడియం శ్రీహరి పట్ల ఆయన అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదివారం ప్రకటించారు. అంతకుముందు, శాసనసభా వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు ఈ మేరకు సభలో ఒక తీర్మానం ప్రవేశపెట్టగా, మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది.

కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు, ఆయన బాడీ లాంగ్వేజ్ ఒక సీనియర్ దళిత నేతను అవమానించేలా ఉన్నాయని అధికార కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కడియం శ్రీహరి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సమానమైన స్థాయి ఉన్న నేత అని, అలాంటి వ్యక్తిని సభలో అవమానించడం సరికాదని అన్నారు. ఈ విషయాన్ని ఎథిక్స్ కమిటీకి పంపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌పై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఒక దళిత వ్యతిరేకి అని, దళితుడిని సీఎం చేస్తానని మాట తప్పారని ఆరోపించారు. దళిత స్పీకర్‌ను ఎదుర్కోలేకే కేసీఆర్ సభకు రావడం లేదని, గతంలో డిప్యూటీ సీఎం పదవిని రద్దు చేసి దళిత సమాజాన్ని అవమానించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవితో పాటు అనేక మంది దళిత నేతలకు కీలక పదవులు ఇచ్చిందని గుర్తుచేశారు.

అయితే, ఈ చర్యను బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వ డైవర్షన్ పాలిటిక్స్ అని ఆయన ఆరోపించారు. కడియం శ్రీహరి ఏ పార్టీకి చెందినవారో చెప్పాలని మాత్రమే కౌశిక్ రెడ్డి అడిగారని, రెవెన్యూ మంత్రిపై ఉన్న అవినీతి ఆరోపణల నుంచి దృష్టి మరల్చేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందని అన్నారు. కాగా, 2024లో బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌కు దగ్గరైన 10 మంది ఎమ్మెల్యేలలో కడియం శ్రీహరి ఒకరు కావడం గమనార్హం.


Kaushik Reddy
Kadiyam Srihari
Telangana Assembly
BRS MLA
Revanth Reddy
Ethics Committee
Dalit leader
Telangana politics
Sridhar Babu
KCR

More Telugu News