Andhra Pradesh Government: ఎన్టీఏ పరీక్షలకు పటిష్ఠ వ్యవస్థ.. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలను నియమించిన ఏపీ సర్కార్

జాతీయ అర్హత పరీక్ష (నీట్), ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రతను పెంచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే పరీక్షలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎన్టీఏ పరీక్షల సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో ఎన్టీఏకు బలమైన అనుసంధానం ఉండాలని రాధాకృష్ణన్ కమిటీ సూచించింది. దీని ఆధారంగానే కేంద్ర విద్యాశాఖ సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీలను ఏర్పాటు చేసింది.

తాజా ఉత్తర్వుల ప్రకారం, పరీక్షా కేంద్రాల్లో అక్రమాలను నివారించేందుకు అభ్యర్థులను తనిఖీ చేసే (ఫ్రిస్కింగ్) బాధ్యతను పూర్తిగా రాష్ట్ర పోలీసులకే అప్పగించారు. ఇప్పటి వరకు కేంద్రాల వద్ద భద్రత, శాంతిభద్రతలకే పరిమితమైన పోలీసులు ఇకపై ఫ్రిస్కింగ్ కూడా నిర్వహిస్తారు.

ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఛైర్మన్‌గా రాష్ట్ర స్థాయి కమిటీ పనిచేస్తుంది. ఇందులో ఉన్నత విద్యాశాఖ కమిషనర్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్, ఏడీజీ (లా అండ్ ఆర్డర్) సహా పలువురు ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా, జిల్లా కలెక్టర్ ఛైర్‌పర్సన్‌గా జిల్లా స్థాయి కమిటీలు పనిచేస్తాయి. ఈ కమిటీలు నీట్(యూజీ)-2026తో పాటు ఎన్టీఏ నిర్వహించే ఇతర పరీక్షలను సజావుగా, సురక్షితంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాయి.
 
Andhra Pradesh Government
NTA Exams
National Testing Agency
NEET UG 2026
Exam Coordination Committee
G Sai Prasad
Radhakrishnan Committee
AP Government
Education Department
Entrance Exams

More Telugu News