చమురు కంపెనీలకు చెక్ పెట్టిన కేంద్రం.. ఇంధన ఎగుమతులపై పన్ను భారీగా పెంపు
పశ్చిమాసియా యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు ధరలు మండిపోతున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వం తన 'ఇండియా ఫస్ట్' పాలసీని మరోసారి చాటుకుంది. భారతీయ ఆయిల్ రిఫైనరీ కంపెనీలు అంతర్జాతీయంగా ఉన్న అధిక ధరల ఆశతో డీజిల్, విమాన ఇంధనాన్ని విదేశాలకు తరలించకుండా కేంద్రం అడ్డుకట్ట వేసింది. ఇందులో భాగంగా లీటర్ డీజిల్పై రూ. 21.5కి, విమాన ఇంధనం (ATF)పై రూ. 29.5కి ఎగుమతి పన్నును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రిఫైనరీ కంపెనీలకు విదేశాలకు ఎగుమతి చేయడం కంటే దేశీయ మార్కెట్కు సరఫరా చేయడమే లాభదాయకంగా మారుతుంది. తద్వారా మన దేశంలోని పెట్రోల్ బంకుల వద్ద ఏర్పడుతున్న కృత్రిమ కొరతకు చెక్ పడనుంది.
ఈ నిర్ణయం ముఖ్యంగా రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ రిఫైనరీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే వారు అంతర్జాతీయ మార్కెట్లో వచ్చే భారీ లాభాల కోసం ఎగుమతులకు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇప్పుడు ప్రభుత్వం విధించిన ఈ పన్ను వల్ల, వారు తప్పనిసరిగా దేశీయ అవసరాలకే మొగ్గు చూపాల్సి ఉంటుంది. యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఉన్నప్పటికీ, భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా కేంద్రం ఈ సాహసోపేతమైన అడుగు వేసింది.